కరోనా కారణంగా పరీక్ష రాయలేకపోయిన వారికి 14న పరీక్ష
మనతెలంగాణ/హైదరాబాద్ : జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) ఫలితాలు వాయిదాపడ్డాయి. సెప్టెంబర్ 13న జరిగిన నీట్ పరీక్షా ఫలితాలు షెడ్యూల్ ప్రకారం సోమవారం విడుదల కావాల్సి ఉండగా, సుప్రీం కోర్టు ఆదేశాలతో ఫలితాలు ఆలస్యం కానున్నాయి. కరోనా నియంత్రణ చర్యలతో పరీక్ష రాయలేకపోయిన విద్యార్థులకు అక్టోబర్ 14న ఎగ్జామ్ నిర్వహించాలని సుప్రీం కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. కంటైన్మెంట్ జోన్లలో చిక్కుకుపోయిన విద్యార్థులు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఈమేరకు ఫలితాల విడుదల వాయిదా పడింది. అక్టోబర్ 16వ తేదీన ఫలితాలు విడుదల చేస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ట్విటర్లో పేర్కొన్నారు. వచ్చే శుక్రవారం ఎన్ని గంటలకు ఫలితాలు విడుదల చేస్తామనేది తర్వాత తెలియజేస్తామని అన్నారు. విద్యార్థులందరికీ ఆయన ’ఆల్ ది బెస్ట్’ చెప్పారు. నీట్లో వచ్చిన మార్కులు ఆధారంగా విద్యార్థులు అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్, డెంటల్ కోర్స్ ల్లో దరఖాస్తు చేసుకునే వీలుటుంది.
కాగా, కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన నీట్ పరీక్షా నిర్వహణ ఎట్టకేలకు సెప్టెంబర్ 13న కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ’నీట్’ పరీక్షలు నిర్వహిచారు. 15.97 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 13.52 లక్షల మంది పరీక్షలకు హాజరయ్యారు. ఈ ఏడాది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్), జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (జిప్మెర్) సహా అన్ని వైద్య కళాశాలల్లోనూ ఎంబిబిఎస్, బిడిఎస్ ప్రోగ్రామ్స్ అడ్మిషన్లకు నీట్ మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. గత ఏడాది, దేశవ్యాప్తంగా ఎంబిబిఎస్, బిడిఎస్ అడ్మిషన్లన్నింటికీ కలిపి ఒకే నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్ ప్రకటిస్తూ నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) చట్టాన్ని పార్లమెంటు ఆమోదించింది. దీనికి ముందు, ఎయిమ్స్, జిప్మెర్, ఇతర వైద్య కళాశాలలు సొంతంగా ఎంట్రన్స్ టెస్టులు నిర్వహించేవి.