నాలుగో ఉథృతి తగ్గుముఖం పట్టడంతో..
జోహెన్స్బర్గ్: దక్షిణాఫ్రికా రాత్రి కర్ఫూను ఎత్తేసింది. దాదాపు రెండేళ్లుగా ఆ దేశంలో రాత్రి కర్ఫ్యూ అమలులో ఉంది. నాలుగో ఉధృతి శిఖరస్థాయిని తాకి కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధ్యక్షభవనం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రకటనకు ముందు అధ్యక్షభవన అధికారులు నేషనల్ కరోనావైరస్ కమాండ్ కౌన్సిల్(ఎన్సిసిసి), ప్రెసిడెంట్స్ కోఆర్డినేటింగ్ కౌన్సిల్(పిసిసి)తో సమావేశం నిర్వహించారు. ఇక నుంచి రాత్రివేళ ప్రజల కదలికలపై ఆంక్షలు ఉండవని తెలిపింది. అయితే, కొవిడ్ నిబంధనలు పాటించాలని తెలిపింది. నూతన సంవత్సరం సందర్భంగా బహిరంగ ప్రదేశాల్లో 2000 మందికి, ఇండోర్లో 1000 మందికి మాత్రమే పరిమితమై వేడుకలు నిర్వహించుకోవాలని తెలిపింది. వేదిక సామర్థంలో 50 శాతానికే పరిమితి విధించింది. భౌతిక దూరం, మాస్క్ నిబంధనలు అమలు చేయాలని తెలిపింది. ఒమిక్రాన్ను మొదట దక్షిణాఫ్రికాలోనే నవంబర్లో గుర్తించిన విషయం తెలిసిందే. వారం రోజులుగా ఆ దేశంలో తొమ్మిది రాష్ట్రాల్లోని రెండు రాష్ట్రాలుమినహా అంతటా కేసులు తగ్గుముఖం పట్టాయని అధ్యక్ష భవనం తన ప్రకటనలో పేర్కొన్నది.