న్యూఢిల్లీ: తమ కంపెనీ తయారు చేస్తున్న కొవిడ్19 వ్యాక్సిన్ కొవీషీల్డ్కు పూర్తిస్థాయి మార్కెట్ అనుమతుల కోసం భారత ఔషధ నియంత్రణ సంస్థలకు దరఖాస్తు చేసినట్టు సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) సిఇఒ అదార్పూనావాలా తెలిపారు. ఇప్పటికే తమ వ్యాక్సిన్ డోసుల సరఫరా 125 కోట్ల మార్క్ దాటిందని ఆయన తెలిపారు. కొవిషీల్డ్తోపాటు భారత్ బయోటెక్ వ్యాక్సిన్ కొవాగ్జిన్కు ఈ ఏడాది జనవరిలో అత్యవసర వినియోగానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. కొవీషీల్డ్ను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి ఆస్ట్రాజెనెకా రూపొందించింది. భారత్లో ఈ వ్యాక్సిన్ను ఎస్ఐఐ ఉత్పత్తి చేస్తోంది. ఔషధ నియంత్రణ సంస్థలు డిసిజిఐ, సిడిఎస్సిఒలకు అనుమతి కోసం ఎస్ఐఐ దరఖాస్తు చేసింది. అందుకు అవసరమైన తుదిదశ క్లినికల్ ట్రయల్స్ నివేదికల్ని సమర్పించినట్టు ఎస్ఐఐ తెలిపింది. పూర్తిస్థాయి మార్కెటింగ్కు అనుమతి ఇవ్వాలంటే ఔషధ నాణ్యత, భద్రత, సమర్థతలపై నియంత్రణ సంస్థలు సమీక్షించాల్సి ఉంటుంది. యుకె,బ్రెజిల్, దక్షిణాఫ్రికాల్లో 24,244మందిపై, అమెరికా, చిలీ,పెరూల్లో 32,379మందిపై జరిపిన మూడోదశ క్లినికల్ పరీక్షల నివేదికల్ని సిడిఎస్సిఒకు సమర్పించినట్టు ఎస్ఐఐ పేర్కొన్నది.