విదేశాలనుంచి వచ్చే వారిలో 80 శాతం ఈ వేరియంట్ బాధితులే
న్యూఢిల్లీ: దేశంలో డెల్టా వేరియంట్ స్థానాన్ని క్రమంగా ఒమిక్రాన్ వేరియంట్ ఆక్రమిస్తోందని, విదేశాలనుంచి ప్రయాణికుల్లో పాజిటివ్ నిర్ధారణ అయిన వారిలో 80 శాతం మంది ఒమిక్రాన్ బాధితులే ఉన్నారని అధికార వర్గాలు శుక్రవారం తెలిపాయి. అయితే ఒమిక్రాన్ గుర్తించిన వారిలో మూడో వంతు మందిలో స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని, మిగతా వారిలో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదని ఆ వర్గాలు తెలిపాయి. ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా ఒకరినుంచి మరొకరికి సోకే అవకాశం ఉండడం, ఈ వైరస్ సోకిన బాధితుల్లో ఎలాంటి లక్షణాలు కనిపించ పోవడంతో ఈ వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి భారీ ఎత్తున పరీక్షలు చేపట్టాలని కేంద్రం ఇప్పటికే రాష్ట్రాలకు సూచించిన విషయం తెలిసిందే. అలాగే వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కూడా కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. కేసులు ఎక్కువవుతున్న ప్రాంతాల్లో ఈ వైరస్ మరింతగా వ్యాప్తి చెందకుండా చూడడానికి కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేయడంతో పాటు కొవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని కూడా రాష్ట్రాలకు రాసిన లేఖలో కేంద్రం సూచించిన విషయం తెలిసిందే.