Saturday, April 27, 2024

రైలు బోగీలో గ్యాస్ సిలిండర్ పేలి 9 మంది దుర్మరణం

- Advertisement -
- Advertisement -

మదురై: తమిళనాడులో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. మదురై రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న ఓరైలు బోగీ( ప్రైవేట్ పార్టీ కోచ్)లో అగ్నిప్రమాదం సంభవించి సంభవించింది. శనివారం తెల్లవారుజామున 5.15గంటల సమయంలో సంభవించిన ఈ ప్రమాదంలో 9 మంది దుర్మరణం పాలయ్యారు. రైల్లోకి అక్రమంగా తీసుకొచ్చిన గ్యాస్ సిలిండర్ పై టీ చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు దక్షిణ రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ ప్రైవేట్ పార్టీ కోచ్ ఈ నెల 17న ఉత్తరప్రదేశ్‌లోని లక్నోనుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించింది. శుక్రవారం నాగర్‌కోయిల్ జంక్షన్ వద్ద దీన్ని పునలూరుమదురై ఎక్స్‌ప్రెస్‌కు అటాచ్ చేశారు. అదే రోజు రాత్రి మదురై రైల్వే స్టేషన్‌లో దీన్ని డిటాచ్ చేసి స్టాబ్లింగ్ లైన్‌లో నిలిపి ఉంచారు. అయితే ఈ ప్రైవేట్ పార్టీ కోచ్‌లో ప్రయాణిస్తున్న వారిలో ఒకరు రైల్లోకి రహస్యంగా గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చారు.

శనివారం తెల్లవారుజామున దానిపై టీ చేస్తుండగా అది ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో మంటలు చెలరేగాయి. చూస్తూ ఉండగానే మంటలు బోగీ అంతటా వ్యాపించాయి. మంటలను గుర్తించిన కొంత మంది ప్రయాణికులు లాక్ చేసి ఉన్న బోగీ డోర్‌లాక్‌ను పగులగొట్టి తెరవడంతో చాలా మంది దూకేసి ప్రాణాలను కాపాడుకున్నారని, లేకుంటే ఇంకా ఎక్కువ ప్రాణనష్టం జరిగి ఉండేదని ప్రాణాలతో బైటపడిన వారిలో ఒకరు చెప్పారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా.. 20 మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో బోగీలో దాదాపు 65 మంది ఉన్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.
రూ.10 లక్షలపరిహారం
కాగా ఘటనపై రైల్వే శాఖ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున సహాయం ప్రకటించింది. ఈ ప్రైవేట్ పార్టీ బోగీని ఐఆర్‌సిటిసి పోర్టల్ ద్వారా ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి, ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో పాటుగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ ఘటనపట్ల తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు తమిళనాడు సిఎం రూ.3 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించగా, యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రూ.2 లక్షల సహాయాన్ని ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగయిన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన రైల్వే మంత్రిని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News