Wednesday, May 15, 2024

ఎన్‌సిపి ఎక్కడ చీలిపోయింది: శరద్ పవార్

- Advertisement -
- Advertisement -

పుణె: తమ పార్టీలో ఎటువంటి చీలిక లేదని ఎన్‌సిపి అధినేత శరద్ పవార్ స్పష్టం చేశారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తమ పార్టీ నాయకుడిగా కొనసాగుతున్నారని శుక్రవారం శరద్ పవార్ తెలిపారు.

వేరే రాజకీయ వైఖరి తీసుకుని కొందరు నాయకులు ఎన్‌సిపిని వీడారే తప్ప దాన్ని చీలిక అనకూడదని వపార్ వ్యాఖ్యానించారు. అజిత్ పవార్ తమ పార్టీ సీనియర్ నాయకుడని, తమ పార్టీ ఎమ్మెల్యే అంటూ ఎన్‌సిపి వర్కింగ్ ప్రెసిడెంట్, శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలె ప్రకటించిన మరుసటి రోజే పుణె జిల్లాలోని తన స్వస్థలం బారామతిలో శరద్ పవార్ విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

పార్టీకి వ్యతిరేకంగా అజిత్ పవార్ ఒక వైఖరి తీసుకున్నారని, దానిపై అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేశామని, ఆయన స్పందన కోసం ఎదురుచూస్తున్నామని సుప్రియా సూలె గురువారం బారామతిలో విలేకరులతో అన్నారు. ఎన్‌సిపిలో చీలిక లేదని, అజిత్ పవార్ పార్టీ నాయకుడేనంటూ సూలె చేసిన ప్రకటన గురించి శరద్ పవార్ వద్ద ప్రశ్నించగా అవును..ఆ ప్రశ్నే ఉదయించదు అంటూ ఆయన జవాబిచ్చారు. ఎన్‌సిపిలో చీలిక ఏర్పడిందని ఎవరైనా ఎలా అనగలరని ఆయన ప్రశ్నించారు.

ఒక రాజకీయ పార్టీలో చీలిక అంటే ఏమిటి..జాతీయ స్థాయిలో ఒక పార్టీకి చెందిన పెద్ద వర్గం విడిపోతే దాన్ని చీలిక అంటారు. అలాంటిదేమీ ఇక్కడ జరగలేదు. కొందరు పార్టీని వీడారు. కొందరు వేరే రాజకీయ వైఖరి తీసుకున్నారు. ప్రజాస్వామ్యంలో నిర్ణయం తీసుకునే హక్కు ఎవరికైనా ఉంటుంది అంటూ శరద్ పవార్ వ్యాఖ్యానించారు.

అజిత్ పవార్, మరో 8 మంది ఎన్‌సిపి ఎమ్మెల్యేలు ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వంలో జులై 2న చేరారు. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ బాధ్యతలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News