గౌతం గంభీర్
న్యూఢిల్లీ: సొంత గడ్డపై 2011లో జరిగిన వన్డే కప్లో భారత్ ట్రోఫీ సాధించిందంటే దానికి యువరాజ్ సింగ్ ఆల్రౌండ్షో ప్రదర్శనే ప్రధాన కారణమని మాజీ ఆటగాడు గౌతం గంభీర్ స్పష్టం చేశాడు. అయితే ప్రపంచకప్లో యువరాజ్ ప్రతిభను ఎవరూ గుర్తించరని, కేవలం కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కొట్టిన సిక్సర్నే అందరూ పొడుగుతారని గంభీర్ ఆవేదన వ్యక్తం చేశారు. భారత్ రెండోసారి విశ్వవిజేతగా నిలువడంలో చాలా మంది ఆటగాళ్లు కీలకపాత్ర పోషించారన్నాడు. అయినా ఈ విషయంలో ఒక్క కెప్టెన్ ధోనీకి మాత్రమే తగిన గుర్తింపు లభించడం విడ్డూరంగా ఉందన్నాడు. తనతో పాటు యువరాజ్, జహీర్, హర్భజన్, మునాఫ్, రైనా, కోహ్లి తదితరులు ఆయా మ్యాచుల్లో కీలక పాత్ర పోషించిన విషయాన్ని మరువ కూడదన్నాడు. అయినా మీడియాతో పాటు భారత క్రికెట్ బోర్డు కూడా ధోనీని తప్పిస్తే ఇతర ఆటగాళ్లను గుర్తించక పోవడం బాధించే అంశమన్నాడు.