రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్కు వ్యతిరేకంగా పార్లమెంట్ ఉభయ సభల నుంచి టిఆర్ఎస్ సహా విపక్షాల వాకౌట్
డిమాండ్లు ఆమోదించేవరకు బహిష్కరణ
ఒకే రోజు 7బిల్లులకు ఆమోదం
నేడు పార్లమెంట్ నిరవధిక వాయిదా?
న్యూఢిల్లీ: రాజ్యసభలో వ్యవసాయ బిల్లుల ఆమోదం సమయంలో సభ్యుల ప్రవర్తన అనుచితంగా ఉందంటూ ఎనిమిది మంది విపక్ష సభ్యుల సస్పెన్షన్పై విఓఫాల ఆందోళన కొనసాగుతూనే ఉంది. వారి సస్పెన్షన్ను తీవ్రంగా వ్యతిరేకించిన విపక్షాలు మంగళవారం సభనుంచి వాకౌట్ చేశాయి. లోక్సభలో కూడా విపక్షాలు రాజ్యసభ సభ్యులకు సంఘీభావంగా మంగళవారం సభా కార్యకలాపాలను బహిష్కరిస్తూ వాకౌట్ చేశాయి. కాగా బుధవారం సభా కార్యక్రమాల తర్వాత లోక్సభ నిరవధికంగా వాయిదా పడవచ్చని తెలిస్తోంది. లోక్సభలో ప్రతిపక్షాలు వాకౌట్ చేసిన కొద్ది సేపటికే స్పీకర్ ఓం బిర్లా సభాకార్యకలాపాల సలహా కమిటీ( బిఎసి) సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే తగినంత సమయం ఇవ్వలేదన్న కారణంగా కాంగ్రెస్తో సహా ప్రధాన విపక్షాలు బిఎసి సమావేశానికి హాజరు కాలేదు. కాగా బుధవారం సాయంత్రం 3 గంటలకు లోక్సభ సమావేశమైన తర్వాత జీరో అవర్ను పొడిగించి 5 గంటలకు సభను నిరవధికంగా వాయిదా వేయనున్నట్లు ఈ విషయాన్ని అన్ని పార్టీల ఫ్లోర్లీడర్లకు తెలియజేసినట్లు ఆ వర్గాలు తెలిపాయి. కాగా ముందు నిర్ణయించిన ప్రకారం పార్లమెంటు వీతాకాల సమావేశాలు అక్టోబర్ 1 వరకు జరగాల్సి ఉంది. కాగా, లోక్సభ బాటలోనే రాజ్యసభ కూడా నిరవధికంగా వాయిదా పడే అవకాశాలున్నాయి.
నిరవధికంగా బాయ్కాట్ చేస్తాం: ఆజాద్
రాజ్యసభ మంగళవారం సమావేశమైన వెంటనే ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్ లేచి విపక్షసభ్యుల సస్పెన్షన్ను ఎత్తివేసే వరకు సభ కార్యకలాపాలను బాయ్కాట్ చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే ప్రైవేట్ వ్యక్తులు రైతులనుంచి కనీస మద్దతు ధర(ఎంఎస్పి)కంటే తక్కువకు పంటను కొనుగోలు చేయరాదన్న నిబంధనను బిల్లులో చేర్చాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఎంఎస్ స్వామినాథన్ కమిటీ నివేదిక ఆధారంగానే కనీస మద్దతు ధరలను నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈ డిమాండ్లు అంగీకరించక పోతే వర్షాకాల సమావేశాలను పూర్తిగా బహిష్కరిస్తామని కూడా ఆయన స్పష్టం చేశారు. ఆజాద్ డిమాండ్కు మద్దతు తెలియజేస్తూ టిఎంసి, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, ఎన్సిపి, ఎస్పి, శివసేన, ఆర్జెడి, డిఎంకె, టిఆర్ఎస్, ఆప్ సభ్యులు కూడా వాకౌట్ చేశారు. సభ్యులు మాట్లాడడానికి ఎక్కువ సమయం లభించక పోవడం కూడా విపక్షాల అంసంతృప్తికి కారణమవుతోందని కూడా ఆజాద్ అన్నారు. ప్రతిపక్షాల గొంతును నొక్కేస్తున్నారని, వారి హక్కులను కాలరాస్తున్నారని, బిల్లులను సెలెక్ట్ కమిటీ లేదా స్థాయీ సంఘాల స్క్రూటినీకి పంపించాలన్న ప్రతిపక్షాల మూకుమ్మడి డిమాండ్ను కూడా పట్టించుకోలేదని ఆజాద్ అంటూ, మొన్న ప్రజాస్వామ్యం వెన్ను విరిచేశారని నేను భావిస్తున్నానని అన్నారు. కాగా బాయ్కాట్ నిర్ణయంపై పునరాలోచించి సభా కార్యకలాపాల్లో పాల్గొనాలని అందరు సభ్యులకు కోరుతున్నానని చైర్మన్ వెంకయ్య నాయుడు అన్నారు. అయితే సస్పెండయిన సభ్యులు క్షమాపణ చెబితే వారి సస్పెన్షన్ను ఎత్తివేసే విషయాన్ని పరిశీలిస్తామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ చెప్పారు. అన్ని బిల్లులపై కూలంకషంంగా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అయితే ప్రభుత్వం తమ డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో ప్రతిపలు సభా కార్యకలాపాలను బాయ్కాట్ చేస్తున్నట్లు ప్రకటించి వాకౌట్ చేశాయి.
ఒకే రోజు 7 బిల్లులు ఆమోదం
ఇదిలా ఉండగా పార్లమెంటు వర్షాకాల సమావేశాలు బుధవారం నిరవధికంగా వాయిదా పడవచ్చన్న వార్తల నేపథ్యంలో మంగళవారం ఒక్క రోజే రాజ్యసభలో ఏడు బిల్లులు ఆమోదం పొందాయి. ట్రిపుల్ ఐటి చట్ట సవరణ బిల్లు,నిత్యావసర చట్ట సవరణ బిల్లు, బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్ట సవరణ బిల్లు, కంపెనీ చట్ట సవరణ బిల్లు, జాతీయ ఫోరెన్సిక్ సైన్స్ విశ్వవిద్యాలయ చట్ట సవరణ బిల్లు, రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ బిల్లు, పన్ను చట్ట సవరణ బిల్లు ఆమోదం పొందిన వాటిలో ఉన్నాయి.
Opposition to called boycott Monsoon Session