అన్నదాతల పాలిట డెత్వారంట్
వ్యవసాయ బిల్లుపై ప్రతిపక్షాల ధ్వజం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన వ్యవసాయ బిల్లులను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా ఇవి రైతులు పాలిట డెత్ వారంట్లుగా అభివర్ణించాయి. ఆదివారం రాజ్యసభలో ఈ బిల్లులపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ సభ్యుడు ప్రతాప్ సింగ్ బజ్వా మాట్లాడుతూ ఈ బిల్లులు అన్నదాతలకు డెత్ వారంట్ అని అభివర్ణించారు. రైతు ప్రాణాలను హరించే ఈ బిల్లులకు కాంగ్రెస్ మద్దతివ్వబోదని స్పష్టం చేశారు. ‘కాంగ్రెస్ పార్టీ బిల్లులను వ్యతిరేకిస్తోంది. రైతుల డెత్ వారంట్లపై సంతకం చేయబోం. మీరు చేయాలనుకుంటున్న ప్రయోజనాలను రైతులు కోరుకోవడం లేదు. అలాంటప్పుడు వారిని ఎందుకు బలవంతపెడతారు’ అని ఆయన అన్నారు. ‘రైతులు అమాయకులు కారు. ఇది కనీస మద్దతు ధరలను తొలగించే మార్గమని వారు అర్థం చేసుకున్నారు. ఒక సారి ఈ బిల్లు పాసయిన తర్వాత వ్యవసాయమంతా కార్పొరేట్ల చేతుల్లోకి పోతుంది. అందుకే పలు రాష్ట్రాల్లో రైతులు వీధుల్లోకి వచ్చి ఈ బిల్లులకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు’ అని ప్రతాప్ సింగ్ అన్నారు. గతంలో ఈస్టిండియా కంపెనీ, పోర్చుగీసు వారు భారత్పై ఎలా దాడి చేశారో ఇప్పడు కూడా అదే జరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే బిజెపి సభ్యుడు భూపేందర్ సింగ్ బిల్లులను సమర్థిస్తూ, కాంగ్రెస్ పార్టీ ఈ అంశంపై రాజకీయాలు చేస్తోందని, రైతులను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు.
Opposition to Denied Farm Bill in Rajya Sabha