Monday, May 6, 2024

జీవన భద్రత కోసం ఒపిఎస్

- Advertisement -
- Advertisement -

ప్రజల సామాజిక, ఆర్థిక భద్రత కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు వల్ల పేదరికం గణనీయంగా తగ్గిందని కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ వెల్లడించిన మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ (ఎంపిఐ) ద్వారా మనకు అర్థమవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 3.28 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు ఉండగా వారిలో రెండు లక్షల మంది సిపిఎస్ ఉద్యోగులు ఉన్నారు. నూతన ఉద్యోగ నియామకాల వల్ల ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. సిపిఎస్ ఉద్యోగుల సామాజిక, ఆర్థిక భద్రత కోసం సిపిఎస్‌ను రద్దు చేసి ఒపిఎస్‌ను పునరుద్ధరించాల్సి ఉంది. 1 జనవరి 2004 తర్వాత నియమితులైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నూతన పెన్షన్ స్కీం (ఎన్‌పిఎస్) లేదా (సిపిఎస్)ను వర్తింప చేస్తూ భారత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ పథకంలో 18 నుండి 60 సంవత్సరాల వయసు గల భారత పౌరులు ఎవరైనా చేరవచ్చు. చేరిన ప్రతి వ్యక్తికి ప్రాన్ కార్డు జారీ చేయబడుతుంది. అప్పటి వరకు దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న ఒపిఎస్ (ఓల్ పెన్షన్ స్కీమ్) ను రద్దు చేసి దాని స్థానే సిపిఎస్‌ని తీసుకువచ్చారు. సిపిఎస్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు దేశంలోని మెజారిటీ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. పెన్షన్ల ఆర్థిక భారం ప్రభుత్వాలపై పడకుండా ఉండడానికి ఈ సిపిఎస్‌ని తీసుకొచ్చారు. కాని ఉద్యోగుల సామాజిక, ఆర్థిక భద్రతను విస్మరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో జిఒఎంఎస్ 653 తేదీ. 22-9 -2004 ప్రకారం 1 సెప్టెంబర్ 2004 నుండి సర్వీసులో చేరిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థల ఉద్యోగులు, విశ్వవిద్యాలయాల ఉద్యోగులు, గ్రాండ్ ఇన్ ఎయిడ్ పొందుతున్న సంస్థల్లోని ఉద్యోగులు, అటానమస్ కార్పొరేషన్ పరిధిలోని ఉద్యోగులందరికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక సిపిఎస్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్వయించుకుంటూ 23 ఆగస్టు 2014 న జిఒను జారీ చేసింది. దీనితో 1 సెప్టెంబర్ 2004 తర్వాత నియమితులైన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అందరూ సిపిఎస్ పరిధిలోకి తీసుకువచ్చినట్లు అయింది. రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో అటెండర్ నుంచి ఐఎఎస్ అధికారులవరకు దాదాపు రెండు లక్షల మంది ఉద్యోగులు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సిపిఎస్) పరిధిలో పని చేస్తున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు సిపిఎస్ పరిధిలో పని చేయడం వల్ల రిటైర్మెంట్ సమయం లో వచ్చే 50% పెన్షన్, కుటుంబ సభ్యులకు 30% పెన్షన్, కనీసం 16 లక్షల గ్రాట్యుటి, కమ్యూటేషన్ వంటి సౌకర్యాలను కోల్పోతున్నారు. ఒక సిపిఎస్ ఉద్యోగి ఉద్యోగంలో ఉండగా మరణిస్తే వారికి వచ్చే పెన్షన్ ప్రభుత్వం ఇచ్చే ఆసరా పెన్షన్ల కన్నా తక్కువ ఉన్న సందర్భాలు ఉన్నాయి.

సామాజిక, ఆర్థిక భద్రత లేక వారి కుటుంబాలు వీధినపడ్డాయి. వారి కుటుంబాలకి భద్రత కల్పిస్తూ భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటూ వారి జీవితాంతం ప్రజలకు సేవ చేసిన ఉద్యోగులను కాపాడాల్సిన సామాజిక బాధ్యత ప్రజలపై ఉంది. నూతన పెన్షన్ విధానాన్ని రూపొందించి అమలు చేస్తున్నప్పటి నుండి దేశ వ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమాలు చేయడం ప్రారంభించాయి. ఈ ఉద్యమాల తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే గల్లీలో ప్రారంభమైన ఉద్యమాలు ఢిల్లీ వరకు చేరాయి. గతంలో స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌టిఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో సిపిఎస్ రద్దు కోరుతూ చలో పార్లమెంట్‌ని ఉద్యోగ ఉపాధ్యాయులు నిర్వహించారు. సెప్టెంబర్ 1 ని పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ అనేక కార్యక్రమాల ద్వారా ఉద్యోగ ఉపాధ్యాయులు ప్రతి సంవత్సరం నిరసనలు తెలియజేస్తున్నారు.

కేవలం సిపిఎస్ రద్దు కోరుతూ తెలంగాణ రాష్ట్రంలో సిపిఎస్ సంఘాలు ఏర్పడడం గమనార్హం. సిపిఎస్ కింద ఉద్యోగి తన బేసిక్ పేడిఎలలో కలిపి 10%, మ్యాచింగ్ గ్రాంట్‌గా ప్రభుత్వం నుంచి మరో 10% సొమ్మును కలిపి నేషనల్ పెన్షన్ స్కీం ట్రస్ట్ (ఎన్ పిఎస్‌టి) లో జమ చేస్తారు ఉద్యోగికి కేటాయించిన పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్ (ప్రాన్)లో ఈ సొమ్ము జమవుతుంది. ఉద్యోగి పదవి విరమణ పొందే వరకు జమ అయిన మొత్తం నుంచి 60% డబ్బును మాత్రమే ఉద్యోగికి నగదుగా చెల్లిస్తారు. మిగతా 40% డబ్బును భారతీయ స్టాక్ మార్కెట్లో పెట్టుబడిగా పెడతారు. దానిపై వచ్చే లాభాన్ని నెలవారీ పెన్షన్ కింద రిటైర్డ్ ఉద్యోగికి చెల్లిస్తారు. ఒక వేళ షేర్ మార్కెట్లో నష్టాలను చవిచూస్తే ఉద్యోగి డబ్బుల నుంచి తీసుకుంటారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల డబ్బులు స్టాక్ మార్కెట్లో పెట్టి స్టాక్ మార్కెట్ లాభ నష్టాలపై ఉద్యోగి పెన్షన్ ఇవ్వడం అనేది చాలా విచారకరం. వారి సొమ్ముకు ఆర్థిక భద్రత లేకుండా పోతుంది. అందుకే ఈ సిపిఎస్ విధానం నష్టదాయకంగా ఉందని దాన్ని రద్దు చేసి ఒపిఎస్‌ని అమలు చేయాలని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఏండ్లుగా డిమాండ్ చేస్తున్నాయి.

భారత దేశంలోని రాజస్థాన్ చత్తీస్‌గఢ్, జార్ఖండ్, హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, కర్ణాటక రాష్ట్రాలలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సిపిఎస్‌ను రద్దు చేశాయి. ఈ విధంగా కొన్ని రాష్ట్రాల్లో సిపిఎస్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం వల్ల మిగతా రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెరిగింది. సిపిఎస్‌ని రద్దు చేసుకునే అధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పిఎఫ్ ఆర్‌డిఎ) చట్టం ప్రకారం వీలు కల్పిస్తుంది. ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా వారి ఉద్యోగుల సామాజిక ఆర్థిక భద్రత కోసం సిపిఎస్‌ని రద్దు చేయాలనుకుంటే చేసుకునే స్వేచ్ఛ ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ముఖ్యమంత్రి కెసిఆర్ సిపిఎస్ ఉద్యోగుల కోసం జిఒ ఎంఎస్ నెంబర్ 58 తేదీ 11-6- 2021 ప్రకారం ఉద్యోగి మరణిస్తే వారి వారసులకు కుటుంబ పెన్షన్ చెల్లించబడుతుందని ఉత్తర్వులు జారీ చేశారు. దీనిలో అప్పటివరకు ఉద్యోగి జీతం నుండి మినహాయించబడిన సిపిఎస్ చందా మొత్తం ప్రభుత్వానికి సరెండర్ చేయాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ సంఘాలలో ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ, జాక్టో నేతృత్వంలో దశాబ్ద కాలంగా సిపిఎస్ రద్దు కోరుతూ పోరాటం చేస్తున్నారు. టిఎన్‌జిఒలు, ఎన్‌జిఒలు, సిపిఎస్ రద్దు కోరుతూ ఏర్పడిన ఉద్యోగ సంఘాలు పోరాటాలు చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఉద్యోగ ఉపాధ్యాయులు ఐక్య ఉద్యమాలకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రాబోయే ఎన్నికలకు ముందే ముఖ్యమంత్రి కెసిఆర్ సిపిఎస్‌ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంటారని ఒపిఎస్ ను పునరుద్ధరిస్తారని ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. రెండు లక్షల మంది సిపిఎస్ ఉద్యోగుల కుటుంబాల్లో వెలుగులు నింపుతారని ఆశిస్తున్నారు. ఎన్‌జిఒలు, టిఎన్‌జిఒలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ముఖ్యమంత్రి కెసిఆర్‌పై తమకు నమ్మకం ఉందని ఎన్నికలకు ముందు ఖచ్చితంగా సిపిఎస్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంటారని ఒపిఎస్‌ను పునరుద్ధరిస్తారనే నమ్మకంతో ఉన్నారు.

-పాకాల శంకర్ గౌడ్, 9848377734.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News