టోక్యో: మరి కొన్ని రోజుల్లో ఒలింపిక్స్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో కరోనా భయం నిర్వాహకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త్వరలో ఒలింపిక్స్ క్రీడా సంబరం మొదలవుతున్న వేళ క్రీడా గ్రామంలో తొలి కేసు నిర్ధారణ అయ్యింది. దీంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో ఓ వ్యక్తికి కరోనా ఉన్నట్టు తేలింది. ఈ విషయాన్ని ఒలింపిక్ నిర్వాహక కమిటీ ధ్రువీకరించింది. మెగా క్రీడలకు వేడుకగా నిలుస్తున్న టోక్యో నగరంలో ప్రస్తుతం కరోనా వేగంగా విస్తరిస్తోంది. రోజు రోజుకు కరోనా కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. తాజాగా క్రీడా గ్రామంలో కూడా కరోనా కేసు బయటపడడంతో నిర్వాహకుల్లో ఆందోళన నెలకొంది. అయితే ఒలింపిక్స్ వంటి పెద్ద టోర్నీల్లో ఇలాంటి చిన్న చిన్న అవరోధాలు ఎదురు కావడం సహాజమని, వీటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని జపాన్ ప్రభుత్వ అధికారులు పేర్కొంటున్నారు.