ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ వెల్లడి
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఇకపై ఆక్సిజన్ కాన్సెంట్రెటర్స్ ఇంటివద్దకు రానున్నాయి. ఢిల్లీలోని ప్రతి జిల్లాలో ఆక్సిజన్ కాన్సెంట్రెటర్ బ్యాంకులను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. దీనితో కరోనా వైరస్పై పోరుకు మరింత ఊతం అందించినట్లు అవుతుందని కేజ్రీవాల్ వివరించారు. కరోనా సోకి హోం ఐసోలేషన్లో ఉండే వారు అవసరం అయితే కోరుకుంటే కాన్సెంట్రేటర్స్ను ఇంటివద్దకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఐసోలేషన్లో ఉండి, మెడికల్ ఆక్సిజన్ అవసరం ఏర్పడితే వారు ఫోన్ ద్వారా తెలియచేస్తే రెండు గంటల వ్యవధిలోనే హోమ్ డెలివరీకి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అవసరం అయినప్పుడు వెనువెంటనే కరోనా రోగులను ఐసియూలలో చేర్పించాల్సి ఉంటుంది. అక్కడ ఆక్సిజన్ ఏర్పాట్లు, ఇతర చికిత్సలు నిమిషాల వ్యవధిలో జరిగిపోవాలి. లేకపోతే వారి ప్రాణాలు పోతున్నాయి. ఈ పరిస్థితి రాకుండా చేసేందుకు ఇంటివద్దనే వారు ఐసోలేషన్లో ఉండి, ఆక్సిజన్ పొందుతూ చికిత్స పొందేందుకు అన్ని విధాలుగా ఈ హోం డెలివరీ కార్యక్రమం ఉపయోగపడుతుందని చెప్పారు.