ఎఫ్డిఎ నుంచి అనుమతి ..
నాగ్పూర్: బ్లాక్ ఫంగస్ రోగులకు చికిత్సలో వినియోగించే ఆంఫోటెరిసిన్ బి ఇంజెక్షన్ ఉత్పత్తికి అనుమతి దక్కింది. వార్థాలోని జెనెటెక్ లైఫ్ సైన్సెస్ ఉత్పత్తి కేంద్రంలో ఈ సూదిమందు తయారీకి ఆహార ఔషధ ఉత్పత్తి అధీకృతసంస్థ (ఎఫ్డిఎ) నుంచి అనుమతి వచ్చిన విషయాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి కార్యాలయం నుంచి వెలువడ్డ ప్రకటనలో తెలిపారు. కరోనా తీవ్రస్థాయి రోగులలో బ్లాక్ఫంగస్ తలెత్తుతోంది. ఇది ప్రాణాంతకం అవుతోంది. ఇతరతా విషమ పరిస్థితులకు దారితీస్తోంది. రోగులను బ్లాక్ఫంగస్ బారి నుంచి రక్షించేందుకు అత్యవసరంగా ఇంజెక్షన్ల అవసరం ఉందని ప్రభుత్వ వర్గాల నుంచి అత్యవసర సందేశం మేరకు జెనెటెక్ సంస్థకు ఈ అవకాశం దక్కింది. ఇప్పటికే మరో ముఖ్యమైన మందు రెమ్డెసివిర్ ఇంజెక్షన్లను ఈ సంస్థ ఉత్పత్తి చేస్తోంది. వీటికి ముందుగానే అనుమతి వచ్చింది. ఇప్పుడు అంఫోటెరిసిన్ బి ఇంజెక్షన్ల వాడకానికి కూడా మహారాష్ట్ర ఎఫ్డిఎ నుంచి వెంటనే అధికారిక ముద్ర వేశారు.
వార్థాలో 15 రోజులలోనే ఈ ఇంజెక్షన్ల ఉత్పత్తి ప్రారంభం అవుతుంది. దీనికి సాధారణంగా ధర రూ 7000 వరకూ ఉంటుంది. అయితే ఇది రోగులకు కేవలం రూ 1200కు అందుబాటులోకి తెస్తారు. సరైన ఉత్పత్తి లేకపోవడంతో అత్యధిక ధర ఉండటం, పైగా రోగికి కనీసం ఈ సూదిమందు దాదాపు 40 నుంచి 50 సార్లు వేయాల్సి రావడంతో దీనిని అత్యధిక రోగులు ఖర్చుల భారంతో పొందలేకపోతున్నారు. ఉత్పత్తిని పెంచేందుకు వీలేర్పడితే దీనిని తక్కువ ధరకు అందుబాటులోకి తేవడం జరిగితే , వార్థాలో తయారు అయ్యే ఇంజెక్షన్ ధర రూ 1200 ఉండనుండటంతో ఎక్కువ మంది దీనిని వేసుకునేందుకు వీలేర్పడుతుంది. జెనెటిక్ లైఫ్ సైన్సెస్లో రోజువారిగా 20000వరకూ ఈ ప్రాణరక్షక ఇంజెక్షన్ల తయారీకి వీలుంటుంది.