Wednesday, May 22, 2024

ఆంధ్రా సరిహద్దులో ఉద్రిక్తత

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో కలపాలని ఐదు విలీన గ్రామాల జనం ఆందోళన ఉధృతం

మద్దతు పలికిన ఎంఎల్‌ఎ పొడెం, ప్రజాసంఘాలు, పార్టీలు రహదారిపై ఎక్కడికక్కడే
నిలిచిపోయిన వాహనాలు మోహరించిన రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులు

మన తెలంగాణ /భద్రాచలం : విలీన ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తూ పిచుకలపాడు, ఎటపాక, కన్నాయిగూడెం, పురుషోత్తమపట్నం, గుండాల గ్రామాల ప్రజలు భద్రాచలం, రాజపేటకాలనీ ఆంధ్రా సరిహద్దు వద్ద్ల రహదారిపై ఆదివారం రాస్తారోకో చేపట్టారు. ఆ గ్రామస్థులకు మద్దతుగా భ ద్రాచలం ఎంఎల్‌ఎ పోడెం వీరయ్య, సిపి ఐ, సిపిఎం, బిజెపి, కాంగ్రెస్, వివిధ రాజకీయ పార్టీలు, సంఘాలు రహదారిపై బైఠాయించారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఆంధ్రా సర్కారు ధర్నాలు, రాస్తారోకోలకు అనుమతి నిరాకరించడంతో ముంపు గ్రామస్థులంతా భద్రాచలం సరిహద్దు వద్దకు తరలివచ్చారు. భద్రాచలానికి ఆనుకొని ఉన్న ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారు. ఆంధ్రా వద్దు తెలంగాణ ముద్దు అంటూ గ్రామస్థులు నినాదాలు చేశారు. రాష్ట్ర విభజనలో తమను ఆంధ్రాలో కలిపి తీవ్ర అన్యాయం చేశారని వారు ఆరోపించారు. రెండు గంటలకు పాటు రాస్తారోకో చేయడంతో రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

దీంతో ఇరు రాష్ట్రాల పోలీసులు సరిహద్దు వద్ద మోహరించారు. సరిహద్దు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా అభిలపక్షం నాయకులు మాట్లాడుతూ ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారు. భద్రాచలాన్ని ఆనుకొని ఉన్న ఐదు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. భద్రాచలం నుంచి చర్ల వెళ్లాలన్నా కన్నాయిగూడెం వరకు ఆంధ్రా దాటి వెళ్లవలసిన పరిస్థితి ఉందన్నారు. ఐదు గ్రామాలు కోల్పోవడంతో భద్రాచలం పట్టణం ద్వీపకల్పంగా మారిందని, కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని మా సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పోలీసులు నచ్చ చెప్పడంతో గ్రామస్థులు ఆందోళన విరమించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News