Monday, May 6, 2024

కాంగ్రెస్ కర్నాటకంపై మోడీ ధ్వజం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశాన్ని ఉత్తరాది , దక్షిణాదిగా విభజించే తీరులో వ్యవహరించడం దారుణమని ప్రధాని నరేంద్ర మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి విభజనరేఖల తీరుతో దేశ భవిత కుంటుపడుతుందని, ఇకనైనా కాంగ్రెస్ పార్టీ, కర్నాటకలోని ఆ పార్టీ ప్రభుత్వం ఈ చెలగాటాల వైఖరిని వీడాలని, ఈ మేరకు తాను విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. రాజ్యసభలో బుధవారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల చర్చకు ప్రధాని సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీపరంగా విభజనరేఖలను చిత్రీకరిస్తోంది. పైగా ఆ పార్టీ అధికారంలో ఉన్న కర్నాటక ప్రభుత్వం నుంచి ఏకంగా పత్రికల్లో ప్రకటనలు ఇస్తున్నారని ఇది ప్రజా ధనం దుర్వినియోగం ద్వారా చేస్తున్న దుష్ప్రచారం అవుతోందని విమర్శించారు. కర్నాటకకు కేంద్రం నిధుల వాటాలో , పలు పన్నుల పంపిణీలో అన్యాయం జరుగుతోందని చెపుతూ కర్నాటక కాంగ్రెస్ తరఫున సిఎం సిద్ధరామయ్య ఆధ్వరంలో ధర్నా నిర్వహించడాన్ని ప్రధాని ప్రస్తావించారు. వారు డిమాండ్లను ప్రస్తావించవచ్చు. అయితే వీరు ఎంచుకున్న ద్వేషపూరిత వైఖరి బాధాకరం , దేశానికి నష్టదాయకం అవుతుందని ప్రధాని తెలిపారు. ఈరోజున తాను నిర్థిష్ట విషయంలో తన బాధను ఈ సభావేదిక ద్వారా అందరితో పంచుకుంటున్నానని,

కొందరు వాడుతున్న పదజాలం దేశాన్ని ముక్కలు చేసే స్థాయిలో ఉంటోంది. కేవలం రాజకీయ స్వార్థప్రయోజనాలకు, అధికారం దొడ్డిదారిన దక్కించుకునేందుకు పాల్పడుతున్న చేష్టలు అందరిని కలవరపరుస్తున్నాయని ప్రధాని చెప్పారు. ఎన్నికలు, రాజకీయాలను పరిగణనలోకి తీసుకుని మొత్తం రాష్ట్రం ఈ విధంగా మాట్లాడటం ఇబ్బందికరం. ఇటువంటి భాషపదప్రయోగాలు అనుచితం అని పేర్కొన్న ప్రధాని కర్నాటక ప్రభుత్వం వెలువరించిన యాడ్స్‌లోని భాషను చూసి ఏమనుకోవాలి? అని ప్రశ్నించారు. దేశం ముందుకు వెళ్లుతోంది. రేపటి తరం సరైన భవితను ఎంచుకునేందుకు సాగుతోంది. దీనిని అడ్డుకునే రీతిలో ఇప్పుడు వ్యవహరించడం ఇబ్బందికరం అని స్పష్టం చేశారు. దేశంలోని ఒక ప్రాంతంలో తయారు అయిన వ్యాక్సిన్‌ను దేశంలోని ఇతర పార్టీలకు ఇవ్వడం ఎందుకని కొందరు చెపుతున్నారు ? ఇది ఎంతవరకూ సబబు అని మోడీ ప్రశ్నించారు. ఇటువంటి ఆలోచనలు ఏమిటీ? ఇటువంటి బాదాకరమైన భాషను ఏకంగా ఓ జాతీయ పార్టీ వాడటం నిజానికి విషాదకరం అవుతుందని తెలిపారు.

ఈ దేశం కేవలం భూ తునక కాదు అంతకు మించి ఎంతో ఉంది
భారత దేశం అంటే కేవలం కొన్ని ప్రాంతాల కలయికలతో కూడిన భూ భాగం అని అనుకోరాదు. ఇది భూతునక అనుకోవడం, దీనికి ప్రాంతీయ భేదాలు ఆపాదించడం బాధాకరం అవుతుందని మోడీ తెలిపారు. శరీరంలో ఎక్కడైనా నొప్పి ఉంటే అది అంతటికి తెలుస్తుంది. మన పాదానికి ముల్లు గుచ్చుకుంటే తనకెందుకు లే అని మన చేయి అనుకోదు. దీనిని తొలిగించేందుకు సహజసిద్ధంగా , అసంకల్పితంగా చొరవ తీసుకుంటుందని చెప్పారు. ఇది మనకు కూడా వర్తిసుందని దేశంలో ఎక్కడైనా ఇబ్బంది ఏర్పడితే ఇతర ప్రాంతాలు కూడా బాధపడుతాయి. అందరు కూడా దీనిని అనుభూతి చెందుతారు. ఏదైనా శరీరభాగం పనిచేయకపోతే మనను దివ్యాంగులుగా వ్యవహరిస్తారు. ఏ ప్రాంతం అయినా ప్రగతి లేకపోతే దేశం అంతా కూడా దెబ్బతింటుందని, ప్రగతికర దేశంగా ఎవరూ చూడరని తెలిపారు. దేశాన్ని ఒకే ప్రాంతంగా భావించాల్సి ఉంటుంది, తప్పితే వేర్వేరు భాగాలుగా పరిగణించరాదని,

ఈ భావనతో ముందుకు సాగడం చేటుకు దారితీస్తుందని విమర్శించారు. హిమాలయాలను ఉదాహరణ తీసుకోండి. ఈ పర్వతాల ప్రారంభ చోటున ఉద్భవించిన నదుల జలాలను ఇతర ప్రాంతాల వారు అనుభవించడం లేదా? అని ప్రశ్నించారు. విభజన ఆలోచనలు తలెత్తితే , ఇది ఇంతటితో ఆగిపోదు. బొగ్గు గనులు ఉన్న రాష్ట్రాల బొగ్గు ఇతర ప్రాంతాల వారు పంచుకోకూడదా? కాదంటే ఇక దేశం ఏ గతి నడుస్తుంది? అని ప్రశ్నించారు. తూర్పు రాష్ట్రాలు తమ వైపు నుంచి వీచే గాలిని ఇతర రాష్ట్రాలకు వెళ్లనివ్వమని చెపితే ఏం జరుగుతుందని ప్రశ్నించారు. మా డబ్బు మా పన్నుల వాటా అని కొందరు అనుకోవడం ? ఏమిటిది అని కాంగ్రెస్‌కు చురకలు పెట్టారు. . ఈ దేశం అంతా ఒక్కటిగా భావించుకుని ముందుకు సాగండి. ప్రగతిపథంలో సమిష్టిత్వం తప్పితే సంకుచితం పనికిరాదని మోడీ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News