Monday, April 29, 2024

పౌర బిల్లుకు ఉత్తరాఖండ్ ఆమోదం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : బిజెపి పాలిత ఉత్తరాఖండ్‌లో అత్యంత కీలకమైన ఉమ్మడి పౌర స్మృతి ( యుసిసి) బిల్లు రాష్ట్ర అసెంబ్లీలో బుధవారం ఆమోదం పొందింది. దీనితో దేశంలోని పౌరులందరికి సార్వ్రతిక లేదా ఉమ్మడి చట్టాలు వర్తిస్తాయి. ఈ మేరకు బిల్లుకు చట్టబద్ధతకు వీలేర్పడింది.ఉత్తరాఖండ్ అసెంబ్లీ బుధవారం ప్రత్యేకంగా సమావేశం అయింది. బిల్లును ముఖ్యమంత్రి సభలో ప్రవేశపెట్టారు. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. అయితే అధికార పక్షం దీనిని తోసిపుచ్చింది. దీనితో బిల్లు నెగ్గింది. గవర్నర్ ఆమోదం పొందితే బిల్లు సమగ్రరీతిలో చట్టరూపం దాలుస్తుంది.
బిల్లు ఆమోదం పొందిన తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి విలేకరులతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా అత్యధికులు కోరుకుంటున్న ఆలోచనకు ఇప్పుడు ఆమోదం పొందడం, ఈ క్రమంలో ఉత్తరాఖండ్ రాష్ట్రం అన్ని రాష్ట్రాల కన్నా ముందుండటం కీలక పరిణామం అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, రాష్ట్ర ప్రజలందరికి తాను ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు తెలిపారు.

ప్రధాని మోడీ ఈ విషయంలో తమకు ఎంతో ప్రోత్సాహం అందించారని ఆయనకు మరోసారి ధన్యవాదాలు అని సిఎం తెలిపారు. ఈ బిల్లు ఎవరికో వ్యతిరేకం కాదని, ప్రతి ఒక్కరి మేలుకోసం అని, ప్రత్యేకించి మహిళలకు ఉపయుక్తం అన్నారు. వివాహాలు, భరణాలు, భృతి, వారసత్వం, విడాకులు వంటి వాటిలో అందరికి సమాన హక్కులను ఈ బిల్లు ద్వారా ప్రతిపాదించడం జరిగింది. దీనితో మహిళల పట్ల విచక్షణ తొలిగించేందుకు వారికి సమాన న్యాయం దక్రేందుకు వీలేర్పడిందని తెలిపారు. మతాలు, వర్గాలకు అతీతంగా పౌరులందరికీ పలు విషయాలలో ఉమ్మడి చట్టాల వర్తింపు ఉద్ధేశించి ఈ బిల్లు తీసుకువచ్చారు. పలు సంవత్సరాలుగా ఉమ్మడి పౌరస్మృతి విషయం వివాదాస్పదం అవుతూ వచ్చింది. పాలిత రాష్ట్రాలలో చట్టరూపం దాల్చేందుకు రంగం సిద్ధం అయింది. బిజెపి పాలిత ఉత్తరాఖండ్‌లో తొలిసారిగా ఈ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందింది. దీనితో బిల్లుకు చట్టబద్ధత ఏర్పడింది. తాజాగా రాజస్థాన్‌లోని బిజెపి ప్రభుత్వం కూడా యుసిసి బిల్లును తీసుకువచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంది. వచ్చే అసెంబ్లీ సెషన్‌లో ఈ బిల్లుతీసుకువస్తామని రాజస్థాన్‌లో బిజెపి నేతలు బుధవారం ప్రకటించారు. ఇతర రాష్ట్రాలలో కూడా సంబంధిత విషయంలో చర్యలు ఆరంభం అయ్యాయి. లోక్‌సభ ఎన్నికలకు రెండు నెలల ముందు ఉత్తరాఖండ్ యుసిసి ఆమోదం బిజెపి కార్యాచరణలో మరో కీలక అంశం అయింది.

యుసిసిని చట్టసభలు ఆపాదించలేవు ః ప్రకాశ్ అంబేద్కర్
ఉత్తరాఖండ్‌లో యుసిసి చట్టరూపం తరువాత బిఆర్ అంబేద్కర్ మనవడు, వంచిత్ బహుజన్ అఘాదీ (విబిఎ) నేత ప్రకాశ్ అంబేద్కర్ స్పందించారు. యుసిసిని పార్లమెంట్ ఏకపక్షంగా పౌరులందరిపైనా రుద్దేందుకు వీల్లేదని తెలిపారు. మన రాజ్యాంగం అందరికి మతపరమైన స్వేచ్ఛను ఇచ్చింది. పౌరులు తమ అభిప్రాయం మేరకు ఎంచుకునే మత జీవన విధానాన్ని పాటించవచ్చు , ఏ ప్రాధమిక హక్కుకు ఎటువంటి చేటు లేనంత వరకూ ఈ స్వేచ్ఛ నిరాటంకం అవుతుందన్నారు. రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో మార్చితే తప్పితే యుసిసిని ప్రభుత్వాలు అమలులోకి తీసుకువచ్చేందుకు వీల్లేదని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News