Monday, April 29, 2024

పౌల్ట్రీకి రూ.1500 కోట్లు నష్టం

- Advertisement -
- Advertisement -

 దేశవ్యాప్తంగా రూ.12 వేల కోట్లు లాస్.. 45 రోజుల్లోనే కుప్పకూలిన వైనం
 సోషల్ మీడియాలో అసత్య, తప్పుడు ప్రచారం
 వైద్యులు, ప్రజాప్రతినిధులు కోళ్లకు కరోనా లేదని చెప్పినా దక్కని ప్రయోజనం
 ఒక్క బ్రాయిలర్ కోడికి రూ.75 ఖర్చు… అమ్మకం కిలోకి 10 రూపాయలే
 కొన్నిప్రాంతాల్లో ఉచితంగానే కోళ్ల పంపిణీ
 గుడ్డుకూ గడ్డు కాలమే.. గుడ్లపైనే రోజుకు రూ.7 కోట్ల నష్టం
 చికెన్ రేటు దారుణంగా పడిపోయినా.. ఏ మాత్రం తగ్గని చికెన్ బిర్యానీ, ఇతర చికెన్ వంటకాల రేట్లు

 

మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా (కొవిడ్19) ప్రభావంతో ఎపి, తెలంగాణ పౌల్ట్రీ పరిశ్రమ ఇప్పటి వరకు దాదాపు రూ.1500 కోట్ల వరకు నష్టం మూటగట్టుకుంది. దేశవ్యాప్తంగా చూస్తే దాదాపు రూ.12 వేల కోట్ల వరకు నష్టం వాటిల్లింది. కోళ్ల ద్వారా కరోనా వ్యాపిస్తుందనే దానికి ఎటువంటి శాస్త్రీయత, నిరూపణ లేకపోయినAప్పటికీ సోషల్ మీడియాలో వచ్చిన తప్పుడు ప్రచారంతో 45 రోజుల వ్యవధిలోనే పౌల్ట్రీ పరిశ్రమ కుప్పకూలిపోయింది. వైద్యులు, శాస్త్రవేత్తలు, ప్రజాప్రతినిధులు కోళ్లకు కరోనా లేదని, రాలేదని చెప్పినా చికెన్, ఎగ్ మేళాలు నిర్వహించినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ఆధారపడిన 25 వేల మంది పౌల్ట్రీ రైతుల భవిష్యత్ ఆగమ్యగోచరంగా మారింది. చికెన్ కోసం వినియోగించే బ్రాయిలర్ కోళ్లు సాధారణంగా 36 రోజుల నుంచి 40 రోజులకు 1.8 కిలోల నుంచి 2 కిలోల వరకు ఎదిగి కటింగ్‌కు వెళ్తాయి. ఒక్క బ్రాయిలర్ కోడి ఉత్పత్తికి రూ.75 వరకు ఖర్చు అవుతుంది. అయితే ఇప్పుడు మార్కెట్‌లో ఒక్క కోడి కిలోకు రూ.8 నుంచి రూ.10లకే అమ్ముకుంటున్నారు. అంటే ఉత్పత్తి ధర కంటే 90 శాతం తక్కువకు అమ్ముకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఉచితంగానే కోళ్లను ఇచ్చేయడం గమనార్హం. అదే ఫిబ్రవరి మొదటి వారంలో కిలో చెకెన్ రూ.150 ఉంది. ఇప్పుడు రిటైల్‌లో కిలో చికెన్ రూ.20, రూ.30కి విక్రయిస్తున్నారు. రోజుల వ్యవధిలోనే ధర అమాంతం పడిపోయింది. విచిత్రం ఏమిటంటే చికెన్ సెంటర్‌లకు వెళ్లి కొనుగోలు చేయని వినియోగదారులు, ఉచితంగా ఇస్తుంటే ఎగబడి మరీ తీసుకుంటున్నారు. ఇక చికెన్ బిర్యానీ అమ్మకాలు కూడా పెద్దగా పడిపోలేదు. వేసవి మొదలు కావడంతో సాధారణంగానే కొంత వినియోగం తగ్గుతుందని చికెన్ బిర్యాని రెస్టారెంట్ల నిర్వాహకులు మన తెలంగాణకు తెలిపారు. అదే సమయంలో చికెన్ రేట్లు దారుణంగా పడిపోయినా ఎక్కడా కూడా చికెన్‌బిర్యానీ, ఇతర చికెన్ తిండి పదార్థాలకు ధర ఏ మాత్రం తగ్గించలేదు. దేశవ్యాప్తంగా రూ.1.20 లక్షల కోట్లు పౌల్ట్రీ ఇండస్ట్రీ ఉంది.
రాష్ట్రంలో మూడున్నర కోట్ల కోళ్లు ఉంటాయి. ప్రతీ రోజు 6 లక్షల కోళ్లు విక్రయాలకు వెళ్తుంటాయి. అదే సమయంలో ప్రతీ రోజు 6 లక్షలు బ్రాయిలర్ కోళ్లు ఫామ్‌లో పెంపకానికి వస్తాయి. 40 గ్రాములున్న వాటికి దాణా, ప్రత్యేక వాతావరణం కల్పించి దానిని 40 రోజుల్లో ఎదుగుతాయి. అయితే గత కొన్నిరోజులుగా కరోనా వస్తుందనే ఆపోహాతో పౌల్ట్రీ ఇండస్ట్రీ కూలిపోయింది. మూడున్నర కోట్లు కోళ్లు ఉండాల్సిన మన రాష్ట్రంలో ఇప్పుడు 70 శాతం పడిపోయినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ధర లేకపోవడంతో ముందు, ముందు పరిస్థితి ఎలా ఉంటుందున్న ఆందోళనతో కొత్తగా ఫామ్‌లో కోళ్లను పెట్టడం లేదు.
ఉన్న వాటిని కూడా దాదాపుగా తీసేస్తున్నారు. లేయర్ కోళ్లు గుడ్లు పెట్టే స్థితి కోల్పోయిన తరువాత వాటిని కూడా చికెన్ సెంటర్లకు తరలిస్తారు. సగటున లక్షన్నర లేయర్ కోళ్లు అమ్ముడుపోవాల్సిన సమయంలో 10 వేలు కూడా పోవడం లేదు. అసలే మార్కెట్ పరిస్థితి బాగోలేని సమయంలో ఒక్క కోడికి పెట్టుబడి మీద రూ.70 నష్టం వస్తుంటే ఉన్న కోళ్లకు దాణా ఖర్చులు పెట్టి దండగా అని వదిలేస్తున్నారు. ఫలితంగా మొన్నటి వరకు అధికంగా ఉన్న మొక్కజొన్న, సోయా ధరలు ఇప్పుడు అమాంతం పడిపోయాయి.
గుడ్డుపై రెండు రూపాయల నష్టం
రాష్ట్రంలో సగటున లేయర్ కోళ్లతో రోజుకు 3.70 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతాయి. ఒక్క గుడ్డు ఉత్పత్తి చేసేందుకు రూ.3.75 నుంచి రూ.4 వరకు ఖర్చు అవుతుంది. అయితే ఇప్పుడు ఒక్క గుడ్డు ధర రూ.2.10 బయటకు చెబుతున్నప్పటికీ రూ.1.80లకే అమ్ముకోవాల్సిన దుస్థితిలో ఉన్నామని ఒక పౌల్ట్రీ రైతు వాపోయాడు. ఇలా గుడ్లపైనే రోజుకు రూ.7 కోట్ల నష్టం వస్తోంది. అంటే ఒక్క గుడ్డుపై ఏకంగా 2 రూపాయాలు నష్టం వస్తోంది. వాస్తవానికి దేశంలోనే చికెన్, గుడ్డు వినియోగంలో తెలంగాణ టాప్‌ప్లేస్‌లో ఉంది. అంగన్‌వాడీలకు, ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ రోగులకు గుడ్డును అందిస్తోంది.

Poultry has loss Rs.1500 Crore in Telugu States

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News