న్యూఢిల్లీ: న్యాయ వ్యవస్థకు వ్యతిరేకంగా రెండు ట్వీట్లు చేసి కోర్టు ధిక్కరణకు పాల్పడిన నేరానికి నామమాత్రంగా ఒక రూపాయి జరిమానా చెల్లించడం లేదా ముడూ నెలల కారాగార శిక్షతోపాటు మూడేళ్ల పాటు న్యాయవాద వృత్తి నుంచి బహిష్కరణను ఎదుర్కోవాలంటూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై సీనియర్ న్యాయవాది, హక్కుల కార్యకర్త ప్రశాంత్ భూషణ్ గురువారం దేశ అత్యున్నత న్యాయస్థానంలో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. సెప్టెంబర్ 14న సుప్రీంకోర్టుకు చెందిన రిజిస్ట్రీలో ఒక రూపాయిని డిపాజిట్ చేసిన ప్రశాంత్ భూషణ్ కోర్టు ధిక్కరణ కేసులో రెండు వేర్వేరుగా రివ్యూ పిటిషన్లు దాఖలు చేశారు. కోర్టు ధిక్కరణ నేరంపై తనను దోషిగా ప్రకటిస్తూ ఆగస్టు 14న సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై సెప్టెంబర్ 14న, తనకు జరిమానా లేదా జైలు శిక్ష విధిస్తూ ఆగస్టు 31న వెలువరించిన తీర్పుపై గురువారం ప్రశాంత్ భూషణ్ రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. తనపై వచ్చిన అభియోగాలపై ఓపెన్ కోర్టులో మౌఖికంగా వాదనలు వినాలని కోరుతూ న్యాయవాది కామినీ జైశ్వాల్ ద్వారా ఆయన రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు.
Prashant Bhushan Review Plea against SC Order to pay rs 1 fine