10 మీటర్ల దూరంలో పడి మృతి చెందిన శిశువు
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో ఘోరవిషాదం
మన తెలంగాణ/పెనుబల్లి : ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల పరిధిలో ఘోర విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణితో పాటు కడుపులోని శిశువు దుర్మరణం పాలయ్యారు. రామచంద్రరావు బంజర్ గ్రామానికి చెందిన బలుసుపాటి మురళి తన భార్య కళ్యాణి(20)కి వైద్య పరీక్షల కోసం పెనుబల్లిలోని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. మరో రెండు రోజుల తర్వాత కాన్పు చేస్తామని, తిరిగి అప్పుడే రావాలని వైద్యులు చెప్పడంతో ఇంటికి తిరుగుపయనమయ్యారు. ద్విచక్ర వాహనంపై భార్యా భర్తలు రామచంద్రరావు బంజర్ గ్రామ సమీపానికి చేరుకుంటుండగా సత్తుపల్లి నుంచి ఖమ్మం వెళుతున్న డిసిఎం వ్యాను ఢీకొంది. దీంతో కళ్యాణి శరీరాభాగాలు నుజ్జునుజ్జు అయ్యాయి. కడుపులోని శిశువు సుమారు పది మీటర్లు దూరం ఎగిరిపడడంతో ప్రాణాలు విడిచింది. ఈ ఘటన చూపరులను కంటతడి పెట్టించింది. ప్రమాదంలో మురళి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.