డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామీ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్ లాన్స్లో బిజెపికి చెందిన పలువురు ఎంపిలు, ఎంఎల్ఎలు, అధికారుల సమక్షంలో గవర్నర్ బేబీ రాణి మౌర్య ఆయన చేత ప్రమాణం చేయించారు. ఆయనతో పాటుగా మరి కొందరు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. సత్పాల్ మహరాజ్, హరక్ సింగ్ రావత్, బన్సీధర్ భగత్, యశ్పాల్ ఆర్య కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు. బిషన్ సింగ్ ఛుపాల్, సుబోధ్ ఉనియాల్, అరవింద్ పాండే, గణేశ్ జోషీ, ధన్సింగ్ రావత్, రేఖా ఆర్య, స్వామి యతీశ్వరానంద్ మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో ఉన్నారు. ధామీ ఎంపిక పట్ల పలువురు సీనియర్లు అసంతృప్తితో ఉన్నారని, అందువల్ల ఆయన ఒక్కరే ప్రమాణం చేస్తారని మొదట ప్రచారం జరిగింది.
ఉద్ధమ్ సింగ్ నగర్ జిల్లా ఖతిమానుంచి రెండు సార్లు ఎంఎల్ఎగా గెలిచిన ధామి శనివారం బిజెపి లెజిస్లేచర్ పార్టీ నేతగా ఎన్నికయిన విషయం తెలిసిందే. శుక్రవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తీరథ్ సింగ్ రావత్ స్థానంలో ఎన్నికైన 45 ఏళ్ల ధామి రాష్ట్రానికి అత్యంత పిన్న వయస్కుడైన ముఖ్యమంత్రే గాక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియార్కు అత్యంత సన్నిహితుడని చెబుతున్నారు. కాగా, ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీకి ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలియజేశారు.
Pushkar Singh takes oath as CM of Uttarakhand