న్యూఢిల్లీ : కరోనా సంక్షుభిత దశలో కేంద్రం వైఖరి ఇదే విధంగా కొనసాగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హెచ్చరించారు. ప్రభుత్వం తక్షణం నగదు పంపిణీ చేయాల్సి ఉంది. లేకపోతే పేదవర్గాలు తుడిచిపెట్టుకుపోతాయి, మధ్యతరగతి ప్రజలు సరికొత్తగా పేదలు అవుతారని తెలిపారు. ప్రభుత్వ అనాలోచిత చర్యలతో లాభాలు పొందేది కేవలం క్రోనీ పెట్టుబడిదారులే అని పేర్కొన్నారు. ఈ దేశం చివరికి ఈ నయా పెట్టుబడిదార్ల వశం అవుతుందని తీవ్రస్థాయిలో స్పందించారు. ప్రభుత్వం డబ్బు విడుదల చేయాల్సి ఉందన్నారు. ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగాలు పోయి నానా బాధలు పడుతున్న వర్కర్ల దీనస్థితిని తెలిపే ఓ వార్తా కథనంపై రాహుల్ స్పందించారు.
వైరస్ కట్టడికి, కోలుకోలేని రీతిలో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ బాగుకు సమగ్ర చర్యలకు దిగుతున్నట్లు చెప్పడం తప్ప కేంద్రం చేస్తున్నది ఏదీ లేదన్నారు. దేశంలో పనిలేకుండా పోయిన కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని చెప్పారు. కేంద్రం తక్షణం ప్రతి పేద కుటుంబానికి రూ 10000 నగదు సమకూర్చాలి, వచ్చే ఆరు నెలల పాటు వారి ఖాతాలలోకి కనీసం రూ 7500 చేరేలా చేయాల్సి ఉందన్నారు. సుదీర్ఘ లాక్డౌన్తో తలెత్తిన గడ్డు పరిస్థితి నుంచి గట్టేక్కెందుకు వారిని ప్రభుత్వం ఆదుకోవల్సి ఉందన్నారు. ప్రభుత్వం ముందుగా నగదు ప్రజలకు చేరేలా చూడాల్సి ఉందన్నారు. ఇదే ఇప్పుడు మిగిలిన తక్షణ నివారణోపాయం అన్నారు.