Monday, April 29, 2024

రాజకీయాల్లోకి రాను

- Advertisement -
- Advertisement -

దేవుడు వార్నింగ్ ఇచ్చాడు.. నేను విరమించుకుంటున్నా
రాజకీయ అరంగేట్రంపై రజినీకాంత్ సంచలన ప్రకటన
ప్రజాసేవ కొనసాగిస్తానని స్పష్టీకరణ
అభిమానులకు క్షమాపణలు చెప్పిన తలైవా
ఆత్మీయుల ఒత్తిడే కారణమా?

చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తన రాజకీయ అరంగేట్రంపై సంచలన ప్రకటన చేశారు.అనారోగ్య కారణాల దృష్టా పార్టీ పెట్టడం లేదని తలైవా మంగళవారం స్పష్టం చేశారు. అయితే రాజకీయాలతో సంబంధం లేకుండా తన ప్రజాసేవ కొనసాగుతుందని వెల్లడించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా అభిమానులకు మూడు పేజిల లేఖను విడుదల చేశారు. ‘ ప్రస్తుత కొవిడ్ పరిస్థితుల్లో పార్టీ ప్రారంభించకూడదని నిర్ణయించుకున్నా. ఆరోగ్యం ప్రధానమని ఆత్మీయులు సూచించారు. ఎంతో భారమైన హృదయంతో ఈ నిర్ణయం ప్రకటిస్తున్నా. ఇటీవల అనారోగ్యం బారిన పడడాన్ని దేవుడివార్నింగ్‌గా భావిస్తున్నా. ఎన్నో జాగ్రత్తలుతీసుకున్నా 20 మంది ఉన్న మా చిత్రబృందంలో కొందరు కరోనాకు గురయ్యారు. అలాంటిది నేను ఎన్నికల బరిలోకి దిగితే లక్షల మంది జనం మధ్యలోకి వెళ్లాలి. ప్రస్తుత నా ఆరోగ్య పరిస్థితుల దృష్టా నేను ఆ సాహసం చేయలేను. ప్రజలను ఇబ్బంది పెట్టలేను. కేవలం సోషల్ మీడియా ప్రచారంలో ఏ పార్టీ కూడా ఎన్నికల్లో గెలవ లేదు. అయితే నిజం మాట్లాడడానికి నేనెప్పుడూ వెనకాడను. రాజకీయాలతో సంబంధం లేకుండా నా ప్రజాసేవ కొనసాగుతుంది’ అని రజినీ తన లేఖలో పేర్కొన్నారు. తన నిర్ణయం అభిమానులను విపరీతంగా బాధపెట్టి ఉండవచ్చని, అందుకు తాను వారికి క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు.
కుమార్తెల ఒత్తిడితోనే..
ఇటీవల రజినీ కాంత్ అనారోగ్యానికి గురయిన విషయం తెలిసిందే. అధిక రక్తపోటు కారణంగా హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆయన రెండు రోజుల తర్వాత డిశ్చార్జి అయ్యారు. డిశ్చార్జి అయిన తర్వాత ఆయన గత శనివారం నేరుగా చెన్నై చేరుకున్నారు. అయితే ఆరోగ్య పరిస్థితుల దృష్టా ప్రస్తుతానికి కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్య ఆయనకు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. రాజకీయాలు, పార్టీ పనులు అంటూ నిత్యం అవే ఆలోచనలతో ఉండడం వల్లనే మానసిక ఒత్తిడి పెరుగుతోందని, అందుకే కొన్ని రోజుల పాటు వీటన్నిటికీ దూరంగా ఉండాలని కోరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రజినీ పార్టీ పెట్టడం లేదని మంగళవారం ప్రకటన చేశారు.
అభిమానులకు మళ్లీ నిరాశే..
ఏళ్ల తరబడి ఎదురుచూపులకు తెరదించుతూ వచ్చే ఏడాది రాజకీయాల్లోకి వస్తున్నట్లు తలైవా డిసెంబర్ మొదటి వారంలో ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన వివరాలను డిసెంబర్ 31న వెల్లడిస్తానని కూడా తెలిపారు. ‘త్వరలో అద్భుతాలు.. ఆశ్చర్యాలు జరుగుతాయి.. మారుస్తాం.. అన్నిటినీ మారుస్తాం.. ఇప్పుడు కాకపోతే మరెప్పటికీ జరగదు’ అని రజినీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ ప్రకటన వెలువడిన కొద్ది రోజులకు ‘మక్కల్ సేవై కచ్చి’ పేరుతో తలైవా ఎన్నికల సంఘంలో పార్టీని రిజిస్టర్ చేసినట్లు, ఆయనకు ఆటో గుర్తు కేటాయించినట్లు కూడా వార్తలు చక్కర్లు కొట్టాయి. అంతేకాకుండా త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో రజినీ పార్టీ పోటీ చేస్తుందనే వార్తలు కూడా వచ్చాయి. దీంతో తమిళనాట ఆయన అభిమానులు సంబరాల్లో మునిగి తేలారు. అయితే అకస్మాత్తుగా ఇటీవల రజినీ అనారోగ్యానికి గురి కావడంతో ఆయన రాజకీయ ఆగమనంపైమళ్లీ సందిగ్ధత ఏర్పడింది. తన తదుపరి చిత్రం ‘అన్నాత్తై’ షూటింగ్ కోసం ఆయన కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ వచ్చారు. ఈ క్రమంలో రక్త పోటు హెచ్చతగ్గుల కారణంగా ఆస్పత్రిలో చేరిన ఆయన గత వారం డిశ్చార్జి అయ్యారు. ఈ నేపథ్యంలో పార్టీ పెట్టాలనే ఆలోచనను విరమించుకొంటున్నట్లు తలైవా మంగళవారం ప్రకటించారు. దీంతో మళ్లీ అభిమానులకు నిరాశ తప్పలేదు.

Rajinikanth Announces will not start Political Party

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News