బిల్లుల చెల్లింపుకి లక్ష రూపాయలు తీసుకుంటూ పట్టుబడిన రామంగుండం ఇంచార్జీ మున్సిపల్ కమిషనర్
మనతెలంగాణ/పెద్దపల్లి : పెద్దపల్లి ఆర్డీవో కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు జరిపి ఆర్డీవో అనుచరుడు మల్లికార్జున్ ద్వారా లంచం తీసుకుంటూ మంగళవారం రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ భద్రయ్య తెలిపిన వివరాల ప్రకారం పెద్దపల్లి ఆర్డీవో, రామగుండం మున్సిపల్ కార్పోరేషన్ ఇంచార్జి కమిషనర్ శంకర్ కుమార్ గోదావరిఖని పరిసర ప్రాంతంలో 2020 సంవత్సరంలో కోవిడ్ నివారణ కొరకు వీధులలో వెదజల్లిన హైడ్రోక్లోరైడ్ ద్రావణం పిచికారీకి సంబంధించిన బిల్లుల చెల్లింపులో సదరు బాధిత కాంట్రాక్టర్ రజనీకాంత్ వద్ద రూ.లక్ష డిమాండ్ చేశారు. రామగుండం కార్పోరేషన్ ఇంచార్జి కమిషనర్గా అధనపు విధులు నిర్వహిస్తున్న పెద్దపల్లి ఆర్డీవో శంకర్ కుమార్ కాంట్రాక్టర్ రజనీకాంత్ బిల్లుల చెల్లింపు కోసం మద్యవర్తి ద్వారా ఆర్డీవో రూ.లక్ష డిమాండ్ చేయడంతో సదరు కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
అధికారుల సలహా మేరకు ఆర్డీవో డిమాండ్ చేసిన లంచం డబ్బును మద్యవర్తిగా ఉన్న ఆర్డీవో అనుచరుడు మల్లికార్జున్కు రూ.లక్ష నగదు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పెద్దపల్లి ఆర్డీవో కార్యాలయంలో రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ భద్రయ్య మాట్లాడుతూ, రామగుండం కార్పోరేషన్లో పట్టణ ప్రగతిలో భాగంగా హైడ్రోక్లోరైడ్ ద్రావణం సరఫరాకు సంబంధించిన బిల్లులో సుమారు రూ.9లక్షల 25వేల చెల్లించాల్సి ఉండగా, రూ.లక్ష డిమాండ్ చేసినట్లు ఈ మేరకు కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడని, ఈ మేరకు కరీంనగర్, ఆదిలాబాద్ ఏసీబీ సిఐల బృందంచే దాడులు నిర్వహించి ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులను పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ భద్రయ్య పేర్కొన్నారు. ఈ దాడుల్లో సిఐలు రాము, సంజీవ్, రవికుమార్, ఆదిలాబాద్ సిఐలు సునీల్ కుమార్, జానీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.