ఔట్సోర్సింగ్లో 194 మంది ఎఇఒలు
వెంటనే నియామకం.. జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు
నెల వేతనం రూ.17,500.. నిబంధనలకు అనుగుణంగా రోస్టర్ పద్ధతిలో రిక్రూట్
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న వ్యవసాయ విస్తరణ అధికారుల(ఎఇఒ) పోస్టులను వెంటనే ఔట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నియమాకాలు చేపట్టాలని వ్యవసాయ శాఖ కార్యదర్శి డాక్టర్ బి. జనార్ధన్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు. సిఎం ఆదేశాలకు అనుగుణంగా ఈ ఖాళీలను భర్తీ చేయాలన్నారు. కొత్తగా ఏర్పడిన జిల్లాలకు అనుగుణంగా ఖాళీలను ఉమ్మడి జిల్లా కలెక్టర్లు సోమవారం నుంచే ఈ నియమాక ప్రక్రియ చేపట్టాలని కోరారు. రోస్టర్ పద్ధతిలో, ఇప్పటికే అందుబాటులో ఉన్న నిబంధనలకు అనుగుణంగా ఈ పోస్టులను భర్తీ చేయాలని సూచించారు. వారి నెల వేతనం రూ.17,500గా నిర్ణయించారు. నిబంధనల ప్రకరాం ప్రతి ఐదు ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారి ఉండాలి. రాష్ట్రంలో మొత్తం 2638 ఎఇఒలు ఉండాలి. ఇందులో మూడేళ్ల కిందట చేపట్టిన నియమాక ప్రక్రియతో 2444 పోస్టులు భర్తీ చేశారు. ప్రస్తుతం 194 ఎఇఒ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే జోన్ 5 లో ఆదిలాబాద్లో 25, కరీంనగర్లో 10, వరంగల్లో 21, ఖమ్మంలో 20, ఆరో జోన్లో నిజామాబాద్లో 15, మెదక్లో 26, మహబూబ్నగర్లో 26, నల్లగొండలో 22, రంగారెడ్డిలో 29 మొత్తంగా 194 పోస్టులు ఉన్నాయి.