హైదరాబాద్: రూ.25 వేలలోపు రైతుల పంట రుణమాఫీ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1210 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ కార్యదర్శి డాక్టర్ బి. జనార్ధన్ రెడ్డి బుధవారం బడ్జెట్ ఉత్తర్వులు జారీ చేశారు. 2019-20 బడ్జెట్లో రుణమాఫీ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.6000కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఈ నిధులను ఖర్చు చేయలేదు. తాజాగా రుణమాఫీకి మార్గదర్శకాలను రాష్ట్ర వ్యవసాయశాఖ మంగళవారం విడుదల చేసింది. రాష్ట్రంలో 25వేల వరకు రుణాలున్న రైతులకు ఒకే సారి మాఫీ చేస్తామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం విధితమే.
అందులో భాగంగానే రూ.25వేల లోపున్న రుణాల మాఫీకి ప్రస్తుతం కొనసాగుతున్న బడ్జెట్లో కేటాయించిన రూ.6వేల కోట్ల నుంచి రూ.1210కోట్లు విడుదలకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రుణమాఫీకి సంబంధించి మరో రూ.4790కోట్ల రూపాయల నిధులు మిగిలిపోయాయి. ఇవి వచ్చే ఆర్థిక సంవత్సరానికి క్యారీఫార్వడ్ చేయనున్నారు. రూ.25వేల లోపు రుణాలున్న రైతులు 5.83లక్షల మంది వరకు ఉన్నారు. తాజాగా పరిపాలన అనుమతులు జారీ చేసిన రూ.1210 కోట్ల నిధులను రైతుల పేరిట చెక్కులు తయారు చేసి గ్రామ సభల ద్వారా రైతులకు నేరుగా అందించనున్నారు. మిగతా రుణాలకు నిధులను నాలుగు విడుతల్లో విడుదల చేయనున్నారు.