టర్కీలో శిథిలాల నుంచి బాలికను కాపాడిన రెస్కూ సిబ్బంది
ఇజ్మీర్: భూకంపంతో భీతిల్లిన టర్కీలో మూడేళ్ల చిన్నారిని నాలుగు రోజుల తర్వాత రెస్కూ బృందాలు శిథిలాల నుంచి బయటకు తీసి కాపాడాయి. మంగళవారం ఇజ్మీర్లో రెస్కూ బృందాలు ఈ ఘనతను సాధించాయి. కుప్ప కూలిన భవన శిథిలాల కింద ఆ చిన్నారి 91 గంటలపాటు మృత్యువుతో పోరాడి గెలిచింది. శిథిలాల నుంచి బయటపడిన బాలికను ఐదా గెజ్గిన్గా గుర్తించారు. ఐదాను బయటకు తీసిన సమయంలో దేవుడు గొప్పవాడు అంటూ అక్కడ ఉన్న రెస్కూ సిబ్బంది చప్పట్లు చరుస్తూ ఆనందం వ్యక్తం చేశారు. టర్కీలో శుక్రవారం 7 పాయింట్ల తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. శిథిలాల నుంచి రక్షించిన బాలికను వెంటనే ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. భూకంపంలో ఐదా తన తల్లిని కోల్పోయింది. ఆమె సోదరుడు, తండ్రి ఆ సమయంలో భవనం లోపల లేకపోవడంతో సురక్షితంగా ఉన్నారు. ఈ భూకంపం వల్ల చనిపోయినవారి సంఖ్య 107కు చేరింది.