హైదరాబాద్: పలు ప్రాంతాల్లో వరద ఉధృతికి రోడ్లు కొట్టుకుపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. జాతీయ రహదారులతో పాటు రాష్ట్ర రహదారులు చాలావరకు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా బెంగళూరు, విజయవాడ, వరంగల్, ముంబై హైవేలు దెబ్బతినడంతో రాకపోకలకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ హైవేలపై రోజుకు లక్షలాది వాహనాలు ప్రయాణం చేస్తుంటాయి. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్లు దెబ్బతినడంతో టోల్ రూపంలో వచ్చే ఫీజులతో ప్రభుత్వానికి వాహనదారులకు చాలా నష్టం వాటిల్లుతోంది. భారీగా కురిసిన వర్షాలకు రోడ్డుపై ప్రయాణిస్తున్న వాహనాలు సైతం దెబ్బతిన్నాయి. కొన్ని వాహనాలు వరద ఉధృతికి కొట్టుకుపోయాయి.
5 ఏళ్లలో రూ.25వేల కోట్ల ఖర్చు
ప్రభుత్వం రాష్ట్ర, జాతీయ రహదారుల అభివృద్ధి నిమిత్తం 5 ఏళ్లుగా సుమారు రూ. 25వేల కోట్లను వెచ్చించింది. ఈ సంవత్సరం కురిసిన వర్షాలకు చాలావరకు రోడ్లు దెబ్బతినడంతో ప్రభుత్వానికి అపారనష్టం వాటిల్లింది. ప్రస్తుతం కురిసిన వర్షానికి దెబ్బతిన్న రోడ్లను పునరుద్ధరించడానికి సుమారు రూ.2 వేల కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు భావిస్తున్నారు.
తెగిపోయిన అప్పచెరువు
ప్రస్తుతం మూడురోజులుగా కురిసిన వర్షాలకు నల్గొండ, యాదాద్రి సరిహద్దు అమ్మనబోలు- పొడిచాడు గ్రామాల మధ్య వరదలకు రోడ్డు తెగిపోగా, భూదాన్ పోచంపల్లి – కొత్తగూడెం మధ్య రోడ్డు దెబ్బతినడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుతం వాహనాలను దారి మళ్లీంచారు. శంషాబాద్ గగన్పహాడ్ వద్ద అప్పచెరువు తెగిపోవడంతో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే జాతీయ రహదారి పూర్తిగా ధ్వంసమయ్యింది. జాతీయ రహదారి 44 (బెంగళూరు హైవే) అరాంఘర్- శంషాబాద్ మార్గం గగన్ పహాడ్లోని అప్పా చెరువు కట్ట తెగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గగన్ పహాడ్ అండర్పాస్ రహదారి సగం వరకు కొట్టుకుపోవడంతో వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లేలా ట్రాఫిక్ పోలీసులు సూచనలు జారీ చేశారు.
ఉప్పల్ నల్లచెరువు కట్ట తెగడంతో..
వరంగల్ హైవేలోని ఉప్పల్ నల్లచెరువు కట్ట తెగడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ వచ్చే వాహనాలను ఘట్కేసర్ నుంచి యామ్నాంపేట మీదుగా ఈసీఐఎల్ నుంచి సికింద్రాబాద్ వైపు మళ్ల్లీంచారు. అలాగే హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్లే వాహనాలను నాగోల్, బండ్లగూడ మీదుగా ఓఆర్ఆర్ ద్వారా ఘట్కేసర్వైపు మళ్లీంచారు.
జలదిగ్బంధంలో అండర్పాస్
నాగపూర్ హైవే మార్గంలో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ వర్షంతో మెదక్ జిల్లా మనోహరాబాద్ వద్ద పనులు జరుగుతున్న అండర్పాస్ పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. దీంతో వాహనాలను తూప్రాన్, నాచారం, గజ్వేల్, ములుగు, కిష్టాపూర్ మీదుగా మేడ్చల్ చెక్పోస్టుకు మళ్లీంచారు.
విజయవాడ హైవే మార్గంలోని…
అబ్దుల్లాపూర్మెట్లో రెడ్డికుంట చెరువు తెగిపోవడంతో విజయవాడ హైవే మార్గంలోని ఇమామ్గూడ వద్ద నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో ఎక్కిడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.
శ్రీశైలం హైవేలోనూ..
శ్రీశైలం హైవేలోనూ రహదారులపై వరద నీరు ఉండటంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. వాహనాలు నింపాదిగా కలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల భారీగా గుంతలు ఏర్పడడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
రాజధానిలో తిప్పలు…
మెహిదీపట్నం నుంచి గచ్చిబౌలికి వెళ్లే వాహనాలు ట్రాఫిక్ ఫ్లైఓవర్ ఎక్కకుండా సెవెన్ టూంబ్స్ రోడ్డు మీదుగా వెళ్లాయి. గచ్చిబౌలి నుంచి మెహిదీపట్నం వచ్చే వాహనాలు షేక్పేట, సెన్సార్ వల్లీ, ఫిల్మ్నగర్, బీవీబీ జంక్షన్ , బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12 మీదుగా గమ్యస్థానానికి చేరుకున్నాయి.
80 చోట్ల రాష్ట్ర రహదారులకు కోత
అయితే వరదల తరువాత జాతీయ, రాష్ట్ర రహదారులకు జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని అటు ఆర్అండ్బితో పాటు ఎన్హెచ్ఏఐ అధికారులు భావిస్తున్నారు. కొన్నిచోట్ల చెరువులకు గండ్లుపడి జాతీయ రహదారులు కోతకు గురికావడంతో రాకపోకలు స్తంభించాయని, ఇప్పుడే నష్టాన్ని అంచనా వేయలేమని ఎన్హెచ్ఏఐ అధికారులు పేర్కొంటున్నారు. కొన్నిచోట్ల పునరుద్ధరణ పనులు చేపట్టామని, వరద ఉధృతి తగ్గిన తరువాత మరిన్ని మరమ్మతులు చేపట్టనున్నట్టు అధికారులు తెలిపారు. రాష్ట్ర రహదారులకు సంబంధించి 80 చోట్ల కోతకు గురయినట్టు ఆర్అండ్బి అధికారులు తెలిపారు.
వచ్చే సంవత్సరం ఏప్రిల్లో ఆరు లైన్ల రహదారికి టెండర్లు
తెలంగాణ, ఎపి రాష్ట్రాల వారధిగా ఉన్న హైదరాబాద్, విజయవాడ జాతీయరహదారిగా (65) ఉన్న 6 లైన్ల రహదారి పనులు ఇంకా పూర్తికాకపోవడంతో ఇక్కడ తరుచుగా ట్రాఫిక్ జాం అవుతుండడంతో పాటు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆగష్టు, సెప్టెంబర్లో కురిసిన వర్షానికి ప్రస్తుతం ఉన్న రహదారి చాలావరకు దెబ్బతింది. మూడురోజులుగా కురుస్తున్న వర్షాలకు మరింతగా రహదారులు దెబ్బతినడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం నుంచి ఎపిలోని నందిగామ వరకు 181.5 కిలోమీటర్ల మేర నాలుగు వరుసల రహదారి పనులను సుమారు రూ.1,740 కోట్ల అంచనా వ్యయంతో జిఎంఆర్ సంస్థ 2010లో బిఓటి పద్ధతిన చేపట్టింది. దీనికి సంబంధించి వచ్చే సంవత్సరం ఏప్రిల్లో టెండర్ల ప్రక్రియ నిర్వహించి, 2024 ఏప్రిల్ నాటికి పూర్తి చేయాల్సి ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
జాతీయ రహదారుల నిర్మాణంలో నాసిరకం వస్తువుల వినియోగం
దీంతోపాటు ఈ సంవత్సరం రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో 286 కి.మీల మేర రహదారుల పనులు మొదలుకావాల్సి ఉండగా భూసేకరణ వలన ఆలస్యం జరుగుతోంది. అయితే ఎన్హెచ్ఏఐ పరిహారాన్ని తక్కువగా చెల్లిస్తుండడంతో భూ సేకరణ చేయడానికి అధికారులు వెనుకంజ వేస్తున్నారు. అయితే 2012, 22 సంవ్సతరానికి సంబంధించి మరో 605 కి.మీల రహదారులను భారతమాల కింద నిర్మించడానికి ఎన్హెచ్ఏఐ సిద్ధంగా ఉన్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. అయితే జాతీయ రహదారుల నిర్మాణం జరిగేటప్పుటు నాసిరకం వస్తువులను (సిమెంట్, ఇసుకను) వాడడం వలన ఆ రోడ్లు త్వరగా దెబ్బతింటున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.