Saturday, April 27, 2024

దేశానికే ఆదర్శం ‘పల్ల్లెప్రగతి’

- Advertisement -
- Advertisement -

దేవరుప్పుల : దేశానికే ఆదర్శం ‘పల్ల్లెప్రగతి’ కార్యక్రమమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మండలంలోని కడవెండిలో తెలంగాణా దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం ఆయన నూతన పంచాయతీ భవనం, మన ఊరుమన బడి పాఠశాలను ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. తెలంగాణా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలియచేశారు. పల్లె ప్రగతి కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. కడవెండి ఋణం తీర్చుకోవడానికే పల్లె ప్రగతి కార్యక్రమం ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నానని తెలిపారు. మనకు ఏమి వచ్చిందని కాకుండా మన గ్రామానికి, రాష్ట్రానికి, దేశానికి ఏమి వచ్చిందనేది ముఖ్యం అన్నారు. తెలంగాణా రాక ముందు, వచ్చిన తర్వాత రాష్ట్రం ఎలా ఉందన్న విషయాన్ని ప్రజలంతా విష్లేశించుకోవాలన్నారు. గతంలో ఇక్కడి నుంచి మంత్రి అయిన పొన్నాల లక్ష్మయ్య పట్టించుకోలేదు. 40 ఏళ్ళు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ వల్ల ఏమి కాలేదని ఎద్దేవా చేశారు.

తాను మంత్రి అయ్యాక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినట్లు తెలిపారు. తెలంగాణాలో భూముల విలువ పెంచిన ఘనత సిఎం కెసిఆర్‌కు దక్కుతుందన్నారు. గాంధీజి కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి కంకణం కట్టుకున్నారని అన్నారు. ఇందులో భాగంగానే పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. గ్రామాలాభివృద్ధియే దేశాభివృద్ధికి చిహ్నంగా నిలుస్తుందని భావించి పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఊరూర చేపట్టి గ్రామాల పరిశుభ్రత, స్వచ్ఛతే లక్షంగా దశల వారిగా ప్రగతి కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టినట్లు వివరించారు. తండలన్నింటిని పంచాయతీలుగా మార్చింది సిఎం అన్నారు. ప్రతీ పంచాయతీ కి కార్యదర్శిని నియమించిన రాష్ట్రం తెలంగాణా అన్నారు. ప్రతీ పంచాయతీకి ట్రాక్టరు, ట్రాలీ ఏర్పాటు చేసింది తెలంగాణా ప్రభుత్వం అన్నారు. నర్సరీ, పల్లె ప్రకృతి వనం, సెగ్రిగేషన్ షెడ్, వైకుంఠ ధామం, డంపిండ్ యార్డు ఏర్పాటు మౌళిక సదుపాయాలకు పెద్దపీట వేసిందన్నారు. ప్రతీ ఇంటికి శుద్ధి చేసిన మంచి నీటిని సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణా అన్నారు. కడవెండి పాఠశాలకు మెరుగైన వసతుల కోసం రూ.1.03 కోట్లు వెచ్చించినట్లు తెలిపారు.

మరో రూ.30 లక్షలతో డిజిటల్ తరగతులు సమకూర్చినట్లు వెల్లడించారు. జిల్లా కలెక్టర్ శివ లింగయ్య మాట్లాడుతూ ఈ రోజు పల్లెల్లో పల్లె ప్రగతి పండుగ జరుగుతోందని అన్నారు,. గ్రామాలకు అన్ని రకాల సదుపాయాలు కలిగినట్లు తెలిపారు. సాగు, తాగునీరు, కరెంటు, చెరువులు నిండినట్లు తెలిపారు. చెడును మంచిగా మార్చే విధంగా చెత్తను ఎరువుగా మార్చే ఏర్పాట్లు జరిగినట్లు తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ సిబ్బందిని ఘనంగా సత్కరించారు. ఇటీవల అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన పంచాయతీలకు అవార్డులు బహూకరించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, జిల్లా పంచాయతీ అధికారి రంగాచారి, జిల్లా విద్యాధికారి రాము, సెక్టోరియల్ అధికారులు రాజు, సింగారావు, రామరాజు, స్థానిక ఎంపిపి బస్వ సావిత్రి మల్లేశం, జడ్పిటిసి పల్లా భార్గవి సుందర్ రామిరెడ్డి, మండల విద్యాశాఖ అధికారి అప్పిడి చంద్రారెడ్డి, తహసిల్దార్ ఎడ్ల రవీందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News