మాస్కో : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వీయ నిర్బంధం లోకి వెళ్లనున్నట్టు క్రిమ్లిన్ వెల్లడించింది. ఆయన పరివారం లోని కొందరికి కరోనా సోకిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. మరోవైపు ఈ వారంలో తజికిస్థాన్లో జరగనున్న ప్రాంతీయ భద్రతా సమావేశాలకు పుతిన్ హాజరు కావలసి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన తజికిస్థాన్ అధ్యక్షుడు ఎమోమలి రాఖ్మాన్తో ఫోన్లో మాట్లాడినట్టు తెలిపింది. అన సన్నిహిత వర్గాల్లో కొందరు కరోనా మహమ్మారి బారిన పడ్డారని, అందువల్ల తాను నిర్దిష్ట సమయం పాటు స్వీయ నిర్బంధం లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు ఆయనతో చెప్పారు. అందువల్ల ఈ వారంలో డుషంబేలో జరగబోయే ప్రాంతీయ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనలేక పోతున్నట్టు ఆయనతో చెప్పినట్టు క్రిమ్లిన్ ఓ ప్రకటనలో వివరించింది. పుతిన్కి ఇప్పటికే వ్యాక్సినేషన్ పూర్తయింది. సోమవారం ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సిరియా అధ్యక్షుడు బషర్ అసద్ తోనూ ఆయన భేటీ అయ్యారు. అయితే పుతిన్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ అన్నట్టు సమాచారం. కరోనా పరీక్షలు కూడా చేసుకున్నట్టు తెలుస్తోంది.