రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశం
నేడు సద్దుల బతుకమ్మ
రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ విద్వత్సభ విస్తృతంగా చర్చించి తీసుకొన్న నిర్ణయం మేరకు నేడు సద్దుల బతుకమ్మ జరుపుకోవాలని పండితులు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా 13 వ తేదీన సద్దుల బతుకమ్మగా ఖరారు చేసింది. కొందరు సిద్ధాంతులు మాత్రం బతుకమ్మ పండుగ గురించి ప్రత్యేకంగా శాస్త్రాల్లో ఎక్కడా పేర్కొనందున కచ్చితంగా తేదీలు చెప్పలేమని పేర్కొన్నారు. ఒక్కో జిల్లాలో, ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఈ పండుగను జరుపుకునే సంప్రదాయం ఉందని వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. బతుకమ్మ వేడుకలను వేములవాడలో 7 రోజులు, ఆదిలాబాద్, మహబూబ్నగర్ జిల్లాల్లో కొన్నిచోట్ల 13 రోజుల పాటు ఆడతారని ఎక్కువమంది పండితులు పేర్కొన్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఈనె13వ తేదీనే (నేడు) సద్దుల బతుకమ్మ జరుపుకోవాలని పండితులు పేర్కొనడంతో ప్రభుత్వం కూడా దీనినే ఖరారు చేసింది.
ఏర్పాట్లపై అధికారులకు మంత్రి తలసాని ఆదేశం
నేడు సద్దుల బతుకమ్మ సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నెక్లెస్ రోడ్డులోని కర్బాలా మైదాన్ ఘాట్ను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ప్రభుత్వం బతుకమ్మ పండుకు ప్రాధాన్యం ఇచ్చి వేడుకలను ఘనంగా నిర్వహిస్తుందన్నారు. ఈ వేడుకలకు సంబంధించి వసతుల కల్పనలో నిర్లక్ష్యం చేయొద్దని ఆయన అధికారులను ఆదేశించారు.