15 రోజుల్లోగా వారిని స్వస్థలాలకు చేర్చండి
రాష్ట్రాలు అడిగిన 24 గంటల్లో ప్రత్యేక రైలు ఏర్పాటు
ఉపాధి కల్పనకోసం ప్రణాళికలు రూపొందించాలి
కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలుకు సుప్రీం ఆదేశాలు
న్యూఢిల్లీ: వివిధ రాష్ట్రాల్లో చిక్కుపడిపోయి స్వస్థలాలకు వెళ్లలేక అవస్థలు పడుతున్న వలస కార్మికులను గుర్తించి 15 రోజుల్లోగా వారిని స్వస్థతలాకు తరలించాలని సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలను దేశించింది. అంతేకాకుండా లాక్డౌన్ కారణంగా చాలా మంది వలస కార్మికులు ఉపాధి కోల్పోయారని, అందువల్ల వారి నైపుణ్యాలకు తగినట్లుగా ఉద్యోగాలు పొందేలా ప్రణాళికలను రూపొందించాలని కూడా అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. స్వస్థలాలకు వెళ్లే క్రమంలో సామాజిక దూరం నిబంధనలు ఉల్లంఘించినందుకు వలస కార్మికులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేసే విషయాన్ని పరిశీలించాలని కూడా సంబంధిత అధికారులను సర్వోన్నతన్యాయస్థానం ఆదేశించింది. లాక్డౌన్ కారణంగా చాలామంది వలస కార్మికులు ఉపాధి కోల్పోయారని, ఈ నేపథ్యంలో వారు తిరిగి తమ పాత స్థలాలకు వెళ్లి పని చేయాలనుకుంటే వారి కోసం హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేయాలని సూచించింది.
అలాగే వలస కార్మికులను గుర్తించి వారికి అనువైన ఉద్యోగాలను కల్పించడానికి అందుబాటులో ఉన్న పథకాల వివరాలను జూలై 8 లోగా అఫిడవిట్ రూపంలో న్యాయస్థానానికి సమర్పించాలని ఆయా రాష్ట్ర ప్రభత్వాలను ఆదేశించింది. లాక్డౌన్ విధించిన తర్వాత స్వస్థలాలకు వెళ్లడానికి వలస కార్మికులుఎదుర్కొంటున్న సమస్యలపై మీడియాలో వచ్చిన కథనాలను చూసిన సుప్రీంకోర్టు దీనిపై సుమోటోగా విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. దీనిపై జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు వలస కార్మికులను తరలించడానికి పలు ప్రత్యేక శ్రామిక్ రైళ్లను ఏర్పాటు చేసినప్పటికీ ఇంకా171 శ్రామిక్ రైళ్లు అవసరమన్న విషయాన్ని ధర్మాసనం పరిగణనలోకి తీసుకొంది. రాష్ట్రాలు అడిగిన 24 గంటల్లోగా ప్రత్యేక రైలును ఏర్పాటు చేయాలని రైల్వే శాఖను బెంచ్ ఆదేశించింది. వలస కార్మికులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి పథకాలను అమలు చేస్తున్నాయి, వారికి లాంటి ఉపపాధి కల్పిస్తున్నాయో తెలియజేస్తూ ఒక నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను జూలై 8కి వాయిదా వేసింది.