Monday, April 29, 2024

మూడో రోజూ నష్టాలు

- Advertisement -
- Advertisement -
Sensex ends 379 points lower
379 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్,  ఫైనాన్స్, ఆటో స్టాక్స్‌లో వెల్లువెత్తిన అమ్మకాలు

న్యూఢిల్లీ : దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం కూడా పతనమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు పడిపోవడం, ఫైనాన్స్, ఆటో షేర్లలో నష్టాలతో మార్కెట్లు డీలా పడ్డాయి. బిఎస్‌ఇ సెన్సెక్స్ 379.14 పాయింట్లు కోల్పో యి 51,324.69 వద్ద ముగిసింది. ప్రారంభంలో సూచీ ఆల్ టైమ్ హై 51,903.96ను తాకింది. బజాజ్ ఫైనాన్స్, కోటక్ బ్యాంక్ షేర్లు సెన్సెక్స్‌లో 2- శాతం కంటే ఎక్కువగా పడిపోయాయి. ఒఎన్‌జిసి షేర్లు 8.32 శాతం లాభంతో ముగిశాయి. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 90పాయింట్లు తగ్గి 15,119 వద్ద ముగిసింది. మొత్తం మార్కెట్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లలో ఎక్కువ కొనుగోళ్లు ఉన్నాయి. దీంతో నిఫ్టీ పిఎస్‌యు సూచీ 5.60 శాతం పెరిగింది.

ప్రభుత్వ సంస్థల షేర్లలో కొనుగోళ్లు

మార్కెట్లో వరుసగా మూడో రోజు లాభాల స్వీకరణ నమోదైందని రిలయన్స్ సెక్యూరిటీస్ స్ట్రాటజీ హెడ్ వినో ద్ మోడీ తెలిపారు. మరోవైపు విదేశీ పెట్టుబడిదారులు మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ రంగాలలో కొనుగోళ్లు చేస్తూనే ఉన్నారు. ఊహించిన దానికంటే మంచి త్రైమాసిక ఫలితాలతో మార్కెట్లో పెట్టుబడిదారుల సానుకూల సెంటిమెంట్ ఉందని ఆయన అన్నారు. ఇది మరింత కొనసాగుతుంది, ఎందుకంటే బడ్జెట్ కంపెనీల ప్రయోజనాల కోసం అనేక ప్రకటనలు చేసింది. ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీల షేర్లను గురువారం మార్కెట్లో భారీగా కొనుగోలు చేశారు. నిఫ్టీలో అత్యధికంగా పెరుగుతున్న ఆరు స్టాక్లలో ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి. ఒఎన్‌జిసి షేర్లు 7.6 శాతం, గెయిల్ షేర్లు 7 శాతం, బిపిసిఎల్ షేర్లు 4.2 శాతం, ఇండియన్ ఆయిల్ షేర్లు 4 శాతం పెరిగాయి. కోటక్ సెక్యూరిటీస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (ఈక్విటీ టెక్నికల్ రీసెర్చ్) శ్రీకాంత్ చౌహాన్ మాట్లాడుతూ, ప్రభుత్వరంగ బ్యాంకులు, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ రంగాల స్టాక్స్ మరింత పెరుగుతాయని ఆశిస్తున్నామని అన్నారు.

52 శాతం షేర్లు లాభాల్లో..

బిఎస్‌ఇలో 3,125షేర్లు ట్రేడ్ అయ్యాయి. వీటిలో 1,639 షేర్లు లాభపడగా, 1,328 షేర్లు పతనమయ్యాయి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ సహా 320 స్టాక్‌లలో అప్పర్ సర్క్యూట్ వచ్చింది. బిఎస్‌ఇ లిస్టెడ్ కంపెనీ ల మార్కెట్ క్యాప్ రూ.205.60 లక్షల కోట్ల నుంచి రూ.205.88 లక్షల కోట్లకు పెరిగింది. ఎన్‌ఎస్‌ఇ తాత్కాలిక గణాంకాల ప్రకారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్‌ఐఐలు) రూ.1,008.2 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయగా, దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు (డిఐఐ) రూ.1,283.38 కోట్ల షేర్లను అమ్మారు.

25న గెయిల్ షేర్ బైబ్యాక్ ఆఫర్

ఇంధన దిగ్గజం గెయిల్ ఇండియా ఫిబ్రవరి 25న బైబ్యాక్‌ను ప్రారంభించనుంది. ముఖ విలువ రూ.10 కల్గిన 6.97 కోట్ల వాటాలకు బైబ్యాక్ నిర్వహించనున్నట్టు కంపెనీ వెల్లడించింది. ఈక్విటీ షేరుకు రూ.150 ధర వద్ద టెండర్ ఆఫర్ ప్రక్రియ ద్వారా గెయిల్ బైబ్యాక్ చేపట్టనుంది. ఇది రూ.1,046 కోట్లకు మించకుండా ఉంటుంది. రికార్డు తేదీ జనవరి 28 కాగా, మార్చి 10న బైబ్యాక్ ముగుస్తుంది.

రైల్‌టెల్ ఐపిఒ 42 రెట్లు సబ్‌స్ర్కైబ్

రైల్‌టెల్ ఐపిఒ చివరి రోజు 42.32 రెట్లు సబ్‌స్ర్కైబ్ అయింది. 6.11 కోట్ల షేర్లతో పోలి స్తే 259 కోట్ల షేర్లకు కంపెనీ బిడ్లు అందుకుంది. ఇది యాంకర్ పెట్టుబడిదారుల వాటాను కలిగి ఉండదు. ఐపిఒ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీ ఇప్పటికే రూ .244 కోట్లు సేకరించింది. ఫిబ్రవరి 15 నుండి ప్రారంభించిన ఐపిఒ ధర శ్రేణి ఒక్కో షేరుకు రూ.93- 94గా నిర్ణయించారు. ఐపిఒ ద్వారా రూ .819 కోట్లు సేకరించాలని కంపెనీ భావిస్తోంది. క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బయ్యర్ (క్యూఐబి) వాటా 65.14 రెట్లు సబ్‌స్ర్కైబ్ పొందింది. నాన్- ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ (ఎన్‌ఐఐ) వాటా 73.25 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల వాటా 16.64 రెట్లు స్పందన వచ్చింది. ఉద్యోగుల వాటా 3.35 రెట్లు సబ్‌స్ర్కైబ్ ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News