న్యూఢిల్లీ: ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ/ఆస్ట్రాజెనెకా రూపొందించిన కొవిషీల్డ్ టీకాను భారత్లో అత్యవసర వినియోగానికి అనుమతించాలని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) కోరింది. ఈమేరకు ఆదివారం డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ)కు దరఖాస్తు చేసింది. ఈ విధంగా విజ్ఞప్తి చేసిన తొలి స్వదేశీ సంస్థ ఇదే. అమెరికాకు చెందిన ఫార్మా దిగ్గజం ఫైజర్ అత్యవసర వినియోగానికి డిసిజిఐని శనివారం అనుమతి కోరిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే సీరం దేశ వ్యాప్తంగా అనేక చోట్ల కొవిషీల్డ్ మూడోదశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించింది. ఈ వ్యాక్సిన్పై బ్రెజిల్, బ్రిటన్లో జరిగిన ట్రయల్స్కు ఇవి అదనం కావడం గమనించ వలసి ఉంది. సీరం సంస్థ ఇప్పటికే డిసిజిఐ అనుమతితో 40 మిలియన్ల కొవిషీల్డ్ డోసులను తయారు చేసింది. బ్రిటన్, బ్రెజిల్, భారత్ల్లో జరిపిన ట్రయల్స్ ఫలితాల ఆధారంగా అనుమతులు ఇవ్వాలని సీరం సంస్థ కోరింది.
మిగతా వ్యాక్సిన్లతో సమానంగా తమ కొవిషీల్డ్ వ్యాక్సిన్ ఆశాజనక ఫలితాలు అందించిందని, భద్రత విషయంలో ఎలాంటి హాని లేదని నిరూపణ అయిందని, కరోనా తీవ్రత , మరణాల రేటు ప్రమాదకర స్థాయిలో కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వ్యాక్సిన్ అందుబాటు లోకి రావడం ఉపయోగమౌతుందని సీరం తన దరఖాస్తులో వివరించింది. ఈ టీకాను అన్ని కోణాల్లో మరోసారి పరీక్షించడానికి కొన్ని నమూనాలను కసౌలీ లోని సెంట్రల్ డ్రగ్స్ లేబొరేటరీ (సిడిఎల్)కి పంపినట్టు సమాచారం.