కౌలాలంపూర్: మలేసియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత అగ్రశ్రేణి షట్లర్లు పి.వి.సింధు, సైనా నెహ్వాల్లకు క్వార్టర్ ఫైనల్స్లోనే చుక్కెదురైంది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ పోటీల్లో ఆరో సీడ్ సింధు, అన్ సీడెడ్ సైనాలు ఓటమి పాలయ్యారు. టాప్ సీడ్ తై జు ఇంగ్ (చైనీస్ తైపీ)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో సింధుకు ఓటమి తప్పలేదు. ఏకపక్షంగా సాగిన పోరులో తై జు 2116, 2116తో సింధును చిత్తు చేసింది. ఆరంభం నుంచే తై జు దూకుడును ప్రదర్శించింది. అలవోకగా రెండు సెట్లు గెలిచి మ్యాచ్ను సొంతం చేసుకుంది. మరో క్వార్టర్ ఫైనల్లో సైనా కూడా పరాజయం చవిచూసింది.
ఒలింపిక్ స్వర్ణ పతక విజేత కరోలినా మారిన్ (స్పెయిన్)తో జరిగిన పోరులో సైనాకు ఓటమి ఎదురైంది. ఏక పక్షంగా సాగిన మ్యాచ్లో మారిన్ 218, 217 తేడాతో సైనాను చిత్తుగా ఓడించింది. మారిన్ జోరుకు సైనా ఎదురు నిలువలేక పోయింది. చివరి వరకు దూకుడును ప్రదర్శించిన మారిన్ అలవోకగా రెండు సెట్లు గెలిచి సెమీఫైనల్కు దూసుకెళ్లింది. ఇక, ఈ సీజన్లో ఆడిన తొలి టోర్నమెంట్లోనే భారత షట్లర్లు తీవ్ర నిరాశకు గురి చేశారు. కిదాంబి శ్రీకాంత్, ప్రణయ్, సమీర్ వర్మ తదితరులు ఇప్పటికే ఇంటిదారి పట్టారు. దీంతో మలేసియా ఓపెన్లో భారత పోరాటం ముగిసింది.