Monday, May 6, 2024

హరీష్‌రావుతో గ్రామ రెవెన్యూ అధికారుల భేటీ

- Advertisement -
- Advertisement -

Special revenue inspector Name as VRO

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్‌రావును ఆయన చాంబర్‌లో గ్రామ రెవెన్యూ అధికారులు బుధవారం కలిసి.. పిఆర్సిలో గ్రామ రెవెన్యూ అధికారులు అందరికీ సీనియర్ అసిస్టెంట్ స్కేలును అమలు చేయాలని కోరారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పిఆర్‌సి ద్వారా ఉద్యోగుల యొక్క జీతభత్యాలు పెంచాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో రాష్ట్రంలోని విఆర్‌ఒలందరూ జీతాలు సరిపోక వాళ్ల కుటుంబాలను పోషించలేక సతమతమవుతున్నారు. పిల్లల స్కూలు ఫీజులు కట్టలేక ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రామ రెవెన్యూ అధికారుల పిల్లలకు స్కూల్ , కాలేజీ ఫీజులలో రాయితీ కలిగించాలి.

ఇలా 11 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మంత్రి హరీష్‌రావుకు సమర్పించారు. దాదాపుగా 7 నుంచి 8 సంవత్సరాల నుండి జూనియర్ అసిస్టెంట్‌లో పనిచేస్తున్నాం. ప్రమోషన్లు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. విఆర్వోలందరిని రెవెన్యూశాఖలోనే కొనసాగిస్తూ వారికి స్పెషల్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ లేదా జూనియర్ అసిస్టెంట్‌గా నామకరణం చేసి సీనియార్టీ, అర్హత కలిగిన విఆర్వోలు అందరికీ సీనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ ఇవ్వాలని కోరడం జరిగింది. రాత్రింబవళ్లు కష్టపడి భూప్రక్షాళన విజయవంతం చేసి ముఖ్యమంత్రి చేతుల మీద పెడితే ఆనాడు మమ్ములను ప్రశంసించి ఒక నెల జీతాన్ని బోనస్‌గా చెల్లించడం జరిగింది. మరి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మాత్రం విఆర్వోలకు నష్టం జరుగుతున్నది. ఐదు నెలల నుంచి త్రిశంకు స్వర్గంలో మమ్ములను పెట్టి మాకు ఎలాంటి పోస్టులు ఇవ్వకుండా మాతో అనధికారికంగా అధికారికమైన పనులు చేయిస్తున్నారు. మేము మా కుటుంబాలు ఆత్మగౌరవాన్ని కోల్పోయాం.

63 శాతంతో కలిగిన ఫిట్మెంట్ ఇస్తారని మేము ఆశించాం. పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పిఆర్సి ద్వారా ఉద్యోగుల జీతభత్యాలు పెంచే అవకాశం ఉండాలి. రోజుకు రోజుకు ధరలు పెరుగుతున్న క్రమంలో జీతాలు సరిపోక ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. 7.5 శాతం ఇవ్వడం దారుణం. ఉద్యోగుల హక్కులను కాలరాస్తున్న పిఆర్సి రిపోర్టును విరమించుకోవాలి. సరైన పిఆర్సి ఇచ్చేటట్లు సమాలోచనలు చేసి ఉద్యోగులను సంతోషపెట్టాలి. 11 డిమాండ్లతో కలిగిన వినతిపత్రాన్ని చదివి అతి త్వరలో ముఖ్యమంత్రితో కలిసి అన్ని సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి హరీష్‌రావు హామీ ఇచ్చారు. మంత్రి హరీష్‌రావుని కలిసిన వారిలో నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య, ఆందోల్ శాసనసభ్యులు క్రాంతికిరణ్‌లతో పాటు గ్రామ రెవెన్యూ అధికారుల ప్రతినిధులు గోల్కొండ సతీష్, పల్లెపాటి నరేష్‌లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News