న్యూఢిల్లీ : విఎఫ్ఎస్ గ్లోబల్ సహాయంతో భారత్, యుఎఇలో తమ ప్రయాణికులకు కొవిడ్-19 పరీక్షల సౌకర్యాన్ని ప్రారంభించినట్లు విమానయాన సంస్థ స్పైస్జెట్ మంగళవారం ప్రకటించింది. విమాన ప్రయాణికులకు ముఖ్యంగా అంతర్జాతీయ ప్రయాణికులకు కొవిడ్-19 నెగటివ్ టెస్ట్ రిపోర్ట్ తప్పనిసరి అయినందున చాలా మంది ప్రయాణికులలో ప్రయాణానికి ముందు పాటించవలసిన నియమ నిబంధనలపై అపోహలు నెలకొన్నాయని స్పైస్జెట్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రయాణికులు తమ ఇంటితోసహా తమకు అనుకూలమైన ప్రదేశంలో నమూనాలు అందచేయవచ్చని, టెస్టింగ్కు సంబంధించిన అపాయింట్మెంట్ బుకింగ్ సర్వీసును విఎఫ్ఎస్ గ్లోబల్ అందచేస్తోందని సంస్థ తెలిపింది.
పరీక్ష ఫలితాన్ని సంస్థ అనుబంధ లేబరేటరీ ప్రయాణికుడి ఇ-మెయిల్ అడ్రస్కు 24 నుంచి 60 గంటల్లో పంపుతారని స్పైస్జెట్ పేర్కొంది. భారత్లోని ముంబయి, ఢిల్లీ, కోచ్చి, హైదరాబాద్, కోల్కత, చెన్నై, బెంగళూరు, జలంధర్, చండీగఢ్, అహ్మదాబాద్, పుణెలోని ఐసిఎంఆర్ ఆనుమతించిన లేబరేటరీలలో ప్రయాణికులు తమ శాంపిల్స్ ఇవ్వవచ్చని తెలిపింది. స్థానిక ప్రభుత్వాలు ఖరారుచేసిన ధరల ప్రకారం కొవిడ్-19 టెస్ట్ ఫీజులు భారత్లో ఉంటాయని, పిల్లలకు, పెద్దలకు కూడా ఒకే రకంగా ఫీజు ఉంటుందని తెలిపింది. యుఎఇ నుంచి ప్రయాణించే ప్రయాణికులు అజ్మన్, అబూ దబి, దుబాయ్, షార్జా లేదా యుఎఇలోని తమకు అనుకూలమైన ప్రదేశాలలో విఎఫ్ఎస్ గ్లోబల్ అనుమతించిన లేబరేటరీలలో శాంపిల్స్ ఇవ్వవచ్చని స్పైస్జెట్ పేర్కొంది.