న్యూఢిల్లీ: హైదరాబాద్ విమానాశ్రయం నుంచి దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు కరోనా వైరస్ వ్యాక్సిన్ను రవాణా చేసేందుకు జిఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో(జిహెచ్ఎసి)తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు స్పైస్ జెట్ గురువారం ప్రకటించింది. హైదరాబాద్తోపాటు చుట్టుపక్కల జిల్లాలలో అనేక ఫార్మసీ కంపెనీలు ఉన్నాయి. జిఎంఆర్ గ్రూపు నిర్వహిస్తున్న హైదరాబాద్ విమానాశ్రయం రానున్న రోజుల్లో దేశీయంగా, అంతర్జాతీయంగా కరోనా వ్యాక్సిన్ రవాణాకు కీలక కేంద్రం కానున్నది. ఈ నేపథ్యంలో&తాము కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందం(ఎంఓయు)లో భాగంగా కరోనా వ్యాక్సిన్ తరలింపు కోసం తమకు హైదరాబాద్ విమానాశ్రయంలో తగినంత స్థలాన్ని ప్రాధాన్యత పద్ధతిలో జిహెచ్ఎసి అందచేస్తుందని స్పైస్ జెట్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు వ్యాక్సిన్లను తరలించేందుకు వీలుగా భారీ విమానాలతోసహా సరకు రవాణా విమానాలను పెద్దసంఖ్యలో అందుబాటులో ఉంచుతామని స్పైస్ జెట్ తెలిపింది. స్పెస్ జెట్కు చెందిన రవాణా సర్వీసు స్పైస్ఎక్స్ప్రెస్ ద్వారా సమర్థవంతంగా, వేగంగా, విశ్వసనీయంగా వ్యాక్సిన్ రవాణా జరుగుతుందని, అదే విధంగా వ్యాక్సిన్కు అవసరమైన శీతోష్ణస్థితి వాతావరణాన్ని సమకూర్చుతామని స్పైస్ జెట్ పేర్కొంది.