ముంబై: కరోనా వల్ల దేశంలో అల్లకల్లోల వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ20 టోర్నమెంట్ను నిరవధికంగా వాయిదా వేస్తూ భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) తీసుకున్న నిర్ణయాన్ని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ స్వాగతించాడు. కరోనా వల్ల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందన్నాడు. ఇలాంటి సమయంలో పెద్ద పెద్ద టోర్నీలు నిర్వహించి మరిన్ని సమస్యలు కొని తెచ్చుకోవడం మంచిది కాదన్నాడు. వేలాది కోట్ల రూపాయల నష్టం తప్పదని తెలిసినా బిసిసిఐ మాత్రం టోర్నీని వాయిదా వేసేందుకే మొగ్గు చూపడం ప్రశంసనీయమన్నాడు. టోర్నీ నిర్వహణ కంటే ప్రజల ఆరోగ్యానికే ప్రాధాన్యత ఇచ్చిన బిసిసిఐని ఎంత పొగిడినా తక్కువేనన్నాడు. కరోనా తగ్గే వరకు ఐపిఎల్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదన్నాడు. క్రికెటర్లకు, స్పాన్సర్లకు, ఫ్రాంచైజీలకు కోట్లాది రూపాయల నష్టం ఖాయమని తెలిసినప్పటికీ బిసిసిఐ ఎంతో సాహసంతో ఈ నిర్ణయం తీసుకుందన్నాడు. ఇది తనను ఎంతో ఆనందం కలిగించిందని గవాస్కర్ పేర్కొన్నాడు.