కేంద్రం, రాష్ట్రాల స్పందనకు సుప్రీం నోటీసు
న్యూఢిల్లీ: బిక్షాటనను నేరస్థం చేసే నిబంధనలపై సుప్రీంకోర్టు స్పందించింది. ఈ నిబంధనలను ఎత్తివేయాలనే పిటిషన్పై కేంద్రానికి, నాలుగు రాష్ట్రాలకు నోటీసులు వెలువరించింది. మూడు వారాలలో తమ సమాధానం ఇచ్చుకోవాలని ఇందులో ఆదేశించింది. ఫిబ్రవరి 10వ తేదీననే దీనికి సంబంధించి నోటీసులు వెలువరించిన విషయాన్ని ఈ సందర్భంగా న్యాయమూర్తులు అశోక్ భూషణ్, ఆర్ సుభాష్ రెడ్డితో కూడిన ధర్మాసనం తెలిపింది. ఇప్పటి వరకూ కేవలం బీహార్ రాష్ట్రం నుంచే తగు సమాధానం ఇచ్చుకుందని పేర్కొంది. ఇతర ప్రతివాదుల నుంచి ఇప్పటివరకూ సమాధానం రాలేదని తెలిపింది. మూడు వారాలలో మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, హర్యానాలు వివరణ ఇచ్చుకోవల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
యాచక వృత్తి చేసే వారి పట్ల కఠిన చర్యలకు సంబంధించిన నిబంధనల గురించి కేంద్రం కూడా తమ వైఖరిని తెలియచేయాల్సి ఉంటుంది. మరో మూడు వారాల తరువాత ఈ కేసు తదుపరి విచారణ ఉంటుందని తెలిపిన ధర్మాసనం కేసును వాయిదా వేసింది. అడుక్కోవడం నేర పరిధిలోకి వస్తుందనే నిబంధనలు రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుందని మీరట్ నివాసి విశాల్ పాఠక్ పిటిషన్ దాఖలు చేశారు. 2018లోనే ఢిల్లీ హైకోర్టు దేశ రాజధానిలో యాచిం,చడాన్ని నేర పరిధి నుంచి తప్పించిన విషయాన్ని పిటిషనర్ ప్రస్తావించారు. ఈ దశలో బొంబాయి బిక్షాటన నిషేధ చట్టం 1959 పరిధిలోని బిక్షాటన శిక్షార్హం అనే నిబంధనలు ఎలా చెల్లుతాయని పిటిషనర్ ప్రశ్నించారు.