ఢిల్లీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు సీరియస్
వాయు కాలుష్యంపై రైతులపై తప్పుడు నిందలు
న్యూఢిల్లీ: దేశ రాజధానిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వాయు కాలుష్యానికి పొరుగు రాష్ట్రాలలో జరుగుతున్న పంట వ్యర్థాల దగ్ధం కేవలం 10 శాతం మాత్రమే కారణమని కేంద్రం సోమవారం సుప్రీంకోర్టుకు నివేదించింది. ఢిల్లీలో ఏర్పడిన వాయు కాలుష్యానికి పరిశ్రమలు, రోడ్డుపైన పేరుకుపోయిన దుమ్ము మాత్రమే ప్రధాన కారణాలని కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు.
ఢిల్లీని దట్టంగా కమ్మేస్తున్న పొగకు పంట వ్యర్థాలు తెగలబెడుతున్న రైతులే కారణమంటూ ఢిల్లీ ప్రభుత్వం ఇచ్చిన అఫిడిట్పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. శాస్త్రీయ, న్యాయపరమైన ఆధారాలు లేకుండా రైతులను నిందించడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. పంట వ్యర్థాల దగ్ధం వల్ల కేవలం 4 శాతం మాత్రమే వాయు కాలుష్యం ఏర్పడుతోందంటూ శాస్త్రీయ అధ్యయన నివేదికను కేంద్రం తన అఫిడవిట్లో చేర్చింది. ఢిల్లీలో వాయు కాలుష్య సంక్షోభానికి పరిశ్రమలు, రవాణా, రోడ్డుపైన దుమ్ము ప్రధాన కారణాలైతే కొద్దిపాటి కారణమైన పంట వ్యర్థాల దగ్ధాన్నే ప్రధాన బూచిగా ఢిల్లీ ప్రభుత్వం చూపెట్టడంపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక వారం రోజులపాటు రైతులు తమ పంట వ్యర్థాలను తగలబెట్టకుండా చర్యలు తీసుకోవాలని పంజాబ్, హర్యానా ప్రభుత్వాలను ఆదేశిస్తూ ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది.