దేశం లోని ప్రధాన నగరాల్లో సూరత్కే దక్కిన ఘనత
సూరత్ : గుజరాత్ లోని సూరత్ నగరంలో అర్హులైన వయోజనుల్లో వందశాతం మంది టీకా మొదటి డోసు పూర్తిగా అందుకున్నారని సూరత్ నగరం అర్హులైన 34,33 లక్షల మందికి మొదటి డోసు పూర్తి చేయాలన్న లక్షాన్ని మంగళవారం సాధించిందని అధికారులు తెలిపారు. దేశంలో 50 లక్షలకు పైగా జనాభా కలిగిన పెద్ద నగరాల్లో ఈ లక్షాన్ని సాధించిన ఘనత సూరత్ నగరానికే దక్కిందని డిప్యూటీ మున్సిసల్ ఆశిష్ నాయక్ చెప్పారు. రెండోడోసు కూడా అందుకున్న వారు 48.4 శాతం లేదా 16.61 లక్షల మంది వరకు ఉన్నారని వివరించారు.
పనిచేసే ప్రాంతాలు, హౌసింగ్ సొసైటీలను లక్షంగా చేసుకుని వైద్య సిబ్బంది ప్రోత్సాహంతో ఈ లక్షాన్ని సాధించినట్టు తెలిపారు. వస్త్రాలు, వజ్రాల పరిశ్రమలు కూడా తమ కార్మికులు ముందుకొచ్చి టీకా తీసుకునేలా సహకరించాయని చెప్పారు. రాజ్కోట్ మున్సిపాలిటీ 96.20 శాతం మందికి అంటే 10.98 లక్షల మందికి మొదటి డోసు అందగా, అహ్మదాబాద్లో 93 శాతం మందికి అంటే 44.89 లక్షల మందికి మొదటి డోసు అందింది. వడోదరలో 89.53 శాతం మందికి అంటే 13.51 లక్షల మందికి , భావనగర్లో 89.48 శాతం అంటే 3.96 లక్షల మందికి టీకా డోసు అందింది. గుజరాత్లో ఇంతవరకు 6.25 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయని గుజరాత్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.