హైదరాబాద్ : రాష్ట్రంలో జర్నలిస్టులపై అతిగా ప్రవర్తిస్తున్న పోలీసులపై చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్లూజె) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ కోరారు. ఆంధ్రజ్యోతి పోలిటికల్ బ్యూరో చీఫ్ మెండు శ్రీనివాస్పై సోమవారం రాత్రి పోలీసులు దాడికి పాల్పడటం, అసభ్యకర పదజాలంతో దూషించిన సంఘటనపై విరాహత్ అలీ మంగళవారం డిజిపి మహేందర్రెడ్డిని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సంఘటనతో పాటు నగరంలో మరో ఐదుచోట్ల జర్నలిస్టులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించిన సంఘటనలు జరిగినట్లు ఆయన డిజిపి దృష్టికి తీసుకెళ్లారు. రామంతాపూర్ వద్ద సీనియర్ పాత్రికేయులు మెండు శ్రీనివాస్పై అతిగా ప్రవర్తించిన పోలీసులపై వెంటనే చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.
ముఖ్యంగా ఆయా పత్రికలు, చానళ్లలో పనిచేసే జర్నలిస్టుల వద్ద మాత్రమే అక్రిడిటేషన్ కార్డులుంటాయని, ఇతరత్రా విభాగాల్లో పనిచేసే జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు ఉండవని, ఇందుకుగానూ వారికి పోలీసుల నుండి గుర్తింపు కార్డులు జారీ చేయాలని విరాహత్ కోరారు. విధినిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించకుండా ఉండేందుకు పకడ్బందీ చర్చలు చేపడతాం.. మెండు శ్రీనివాస్పై పోలీసుల ప్రవర్తనపై విచారం వ్యక్తం చేస్తున్నాము. ఈ సంఘటనపై తగు చర్యలు చేపడతామని డిజిపి మహేందర్రెడ్డి హామీ ఇచ్చారు. అలాగే మీడియా సంస్థల్లో అక్రిడిటేషన్ కార్డులు లేని సిబ్బందికి ఆయా పోలీసు కమిషనరేట్ల పరిధిలో సిపిఆర్వోల ద్వారా ప్రత్యేక పాసులు జారీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.