Monday, April 29, 2024

సమయం లేదు మిత్రమా!

- Advertisement -
- Advertisement -

ఆఖరి పోరాటానికి సై.. ప్రచారంలో ప్రధాన పార్టీల మరింత దూకుడు

అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. నవంబర్ 28 సాయంత్రంతో ప్రచారం ముగియనుంది. కేవలం వారం రోజులు వ్యవధి మాత్రమే మిగిలి ఉంది. ఎన్నికల సమయం దగ్గరికి రావడంతో అన్ని పార్టీలు ఆఖరి పోరాటానికి సన్నద్ధమయ్యా యి. ఇప్పటికే బిఆర్‌ఎస్, కాంగ్రెస్, బిజెపి నాయకులు ప్రచారంలో మరింత దూకుడు పెంచారు. గురువారంతో రాజస్థాన్ పోలింగ్ ముగియ నుండంతో జాతీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్ అగ్రనేతలు తెలంగాణలో మకాం వేయనున్నారు. దేశంలోని బడా బడా నేతలంతా ఇక్కడికే తరలి రానున్నారు. నవంబర్ 24 నుంచి వరుసగా ఐదు రోజుల పాటు ప్రచారం మోత మోగించనున్నారు. 24 నుంచి 28 వరకు పలు నియోజకవర్గాల్లో సభలు, రోడ్ షోలు, ర్యాలీలతో హోరెత్తించనున్నారు.

దీని కోసం రాష్ట్రంలోని ఆయా పార్టీల నేతలు ఇప్పటికే కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. హామీ లు, విమర్శలు ప్రతి విమర్శలతో తెలంగాణ దద్దరిల్లనుంది. అధికార పార్టీ తరపు నుంచి కెసిఆర్, కెటిఆర్, హరీశ్‌రావు ఇతర నాయకులు ఆల్రెడీ సుడి గాలి పర్యటనలు చేస్తూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అవతలి వైపు కాంగ్రెస్, బిజెపిలు సైతం అదే స్థాయిలో దూసుకుపోతున్నా యి. ఇప్పటికే ప్రధాని మోడీ, రాహుల్ గాంధీతో సహా పెద్ద పెద్ద నేతలంతా రాష్ట్రానికి వచ్చి వెళ్ళారు. ఇప్పుడు పోలింగ్‌కు ముందు ఐదు రోజులు కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవుదామని బిజెపి, కాంగ్రెస్ పార్టీలు నిర్ణయించాయి.

అది కూడా ఏదో ఒక్క సభకు రావడం వెళ్ళిపోవడం కాకుండా ఒక్కో నేత పదుల సభల్లో పాల్గొననున్నారు. బహిరంగసభలు, రోడ్‌షోలు, ర్యాలీలతో ప్రచారాన్ని ముగించేలా ఏర్పాట్లు చేసుకున్నాయి. ప్రధాని మోడీ నవంబర్ 25, 26, 27 తేదీల్లో మూడు రోజులూ తెలంగాణలోనే ఉండనున్నారు. ఇక్కడ తిరుగుతూ పూర్తి స్థాయిలో ప్రచారం నిర్వహిస్తారని బిజెపి నేతలు చెబుతున్నారు. సభలు, ర్యాలీల్లో పాల్గొననున్నారు. 25న కామారెడ్డి, మహేశ్వరం; 26న తూప్రాన్, నిర్మల్‌లలో బహిరంగ సభలున్నాయి. 27న మహబూబాబాద్, కరీంనగర్ బహిరంగ సభలతో పాటు హైదరాబాద్ రోడ్‌షోలో పాల్గొని తన ఎన్నికల ప్రచారాన్ని ముగిస్తారు. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కూడా 24,26,28 తేదీల్లో తెలంగాణకు రానున్నారు. మరోవైపు బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా కూడా మూడు రోజులు ప్రచారంలో పాల్గొంటారు.

ఇక ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, హిమంత్ బిశ్వశర్మ, సావంత్ కూడా రాష్ట్రానికి వస్తున్నారు. కాంగ్రెస్ తరపు నుంచి రాహుల్, ప్రియాంక నవంబర్ 24 నుంచి 28 వరకు ఇక్కడే ఉండే వరుస సభల్లో పాల్గొననున్నారు. దాదాపు 20 వరకు సభల్లో పాల్గొంటారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ప్రియాంక 24, 25, 27 తేదీల్లో పది నియోజకవర్గాలను పర్యటిస్తారు. 24న పాలకుర్తి, హుస్నాబాద్, ధర్మపురి సభల్లో, 25న పాలేరు, ఖమ్మం, వైరా, మధిర, 27న మునుగోడు, దేవరకొండ, గద్వాల ప్రచార సభల్లో ప్రసంగిస్తారు.

రాహుల్ 24 నుంచి రాష్ట్రంలోనే ఉండి 28న రాష్ట్రంలో ప్రచారం ముగిస్తారు. కామారెడ్డిలో 26న సభలో పాల్గొంటారు. మూడు, నాలుగు రోజులు వరుస సభలు, ర్యాలీల్లో పాల్గొంటారు.ఇక ఇతర ప్రధాన పార్టీ అయిన సిపిఎం నుంచి ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌బ్యూరో సభ్యులు బృందా కారత్, సుభాషిణి అలీ, విజయరాఘవన్ మరికొందరు 25, 26, 27 తేదీల్లో నల్గొండ, ఖమ్మం జిల్లాలతో పాటు హైదరాబాద్ సభల్లో పాల్గొంటారు.

(హరి మోహన్/మన తెలంగాణ)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News