కోర్హీట్ జోన్లో తెలంగాణ
47డిగ్రీలకు ఉష్ణోగ్రతలు
క్యుములో నింబస్ మేఘాలతో పిడుగులు
వడగాడ్పులు అధికమే
వేసవి అంచనాలపై ఐఎండి నివేదిక
హైదరాబాద్: ఈ ఏడాది వేసవి నిప్పుల కుంపట్లను తలపిస్తుందన్న వార్తలు ప్రజలను హడలెత్తుస్తున్నాయి. రాష్ట్రంలో ఈ వేసవిలో అధికంగా 45నుంచి 46డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు రికార్డయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. గత ఏడాది వేసవిలో రాష్ట్రంలోనే అత్యధికంగా అదిలాబాద్ జిల్లాలో 46.3డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మేనెల్లో ఎనిమిదిరోజులపాటు వడగాడ్పులు వీచాయి. ఈ సారి వేసవిలో మరిన్ని ఎక్కువ రోజులు వడగాడ్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రం కోర్హీట్ జోన్లో ఉందని అందుకే ఫిబ్రవరి మూడో వారం నుంచే ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ వస్తున్నట్టు తెలిపింది. అంతే కాకుండా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఎండలు వివరీతంగా పెరిగే అవకాశం ఉంది. అదిలాబాద్ , నిర్మల్ , నిజామాబాద్ ,జగిత్యాల , రామగుండం ,కుమరంభీం, భద్రాచలం వరంగల్ ,ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో ఎండలు అధికంగా ఉండే అవకాశం ఉంది.
ఈ జిల్లాల్లో వడగాడ్పులు కూడా తీవ్రంగానే ఉండే అవకాశం ఉంది. రాష్ట్రంలోలో ఇప్పటివరకూ వేసవి ఉష్ణగ్రత భద్రాచలంలో 48.6డిగ్రీల అత్యధిక రికార్డు నమోదైంది. ఈ సారి ఇది 47డిగ్రీలవరకూ చేరే అవకాశం ఉన్నట్టు ఐఎండి అంచనాలు చెబుతున్నాయి అయితే మార్చి ,ఏప్రిల్ మే నెలల్లో ఎండలు తీవ్రరూపం దాల్చే క్రమంలో అకాల వర్షాలు కొంత ఊరటనిచ్చే అవకాశాలున్నాయి. అంతే కాకుండా క్యుములో నింబస్ మేఘాలు దట్టంగా ఏర్పడి పెనుగాలులు,పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఐఎండి నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.. మహరాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ,గోవా ,గుజరాత్ ఒడిశా తీర ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్న నివేదికలు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. వేసవిలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం(ఐఎండి) అంచనా వేసింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో మార్చినుంచి మే నెల మధ్య ఎండులు ఎలా ఉండబోతున్నాయన్న అంచానాలను ఐఎండి వెల్లడించింది. ఉత్తర , ఈశాన్య ప్రాంతాల్లో పగటి పూట భానుడి ప్రతాపం అధికంగా ఉంటుందని తెలిపింది.
దక్షిణ ,మధ్య భారత్లో మాత్రం ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కొంత తక్కువగానే ఉండవచ్చని అంచాన వేసింది.అయితే తూర్పు, పశ్చిమ ప్రాంతాలతోపాటు , సముద్ర తీరాల దగ్గర అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్ ,మహారాష్ట్ర ,గోవా ,ఒడిశా, గుజరాత్ తీర ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండి అంచనా వేసింది. ఉత్తర భారతంలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగానే ఉండవచ్చని తెలిపింది. ఏప్రిల్ -జూన్కు సబంధించి వేసవి అంచానాలను ఏప్రిల్లో విడుదల చేస్తామని తెలిపింది. తెలంగాణలో మంగళవారం ఉష్ణోగ్రతలు అత్యధికంగా అదిలాబాద్లో 38.3డిగ్రీలుగా నమోదయ్యాయి. భద్రాచలంలో 38.2 హన్మకొండలో 34.5, హైదరాబాద్లో 36.2 , ఖమ్మంలో 35.6 మెదక్లో 36.4,నల్లగొండలో 35.0 డిగ్రీలు నమోదయ్యాయి. నిజామాబాద్లో 35.5 ,రామగుండంలో 36.8డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Telangana falls in core heatwave zone