తెలంగాణ తొలి మహిళా మెకానిక్ ఆదిలక్ష్మికి
అండగా నిలిచిన ఎంఎల్సి కవిత
కొత్త షాపునకు అత్యాధునిక మెషిన్లు ఇవ్వడంతో పాటు
ఇద్దరు ఆడపిల్లలను తానే చదివిస్తానని హామీ
అడగకుండానే సాయం చేసిన కవితకు కృతజ్ఞతలు తెలిపిన ఆదిలక్ష్మి
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ తొలి మహిళా మెకానిక్ ఆదిలక్ష్మికి ఎంఎల్సి కవిత అండగా నిలిచారు. కొత్తగూడెంకు చెందిన మెకానిక్ ఆదిలక్ష్మీ ఎంఎల్సి కవితను ఆమె నివాసంలో కలిశారు. ఆదిలక్ష్మి కొత్త షాపునకు అత్యాధునిక మెషిన్లను అందిస్తానని ఎంఎల్సి కవిత హామీ ఇచ్చారు. అలాగే ఇద్దరు ఆడపిల్లలను చదివిస్తానని భరోసా ఇచ్చారు. మహిళలు ప్రయత్నిస్తే ఏదైనా సాధించగలరని, ఆదిలక్ష్మి జీవితమే అందుకు నిదర్శనమని ఎంఎల్సి కవిత కొనియాడారు. అడగకుండానే సాయం చేసి, ఇద్దరు బిడ్డలను చదివిస్తానని హామీ ఇచ్చిన ఎంఎల్సి కవితకు ఆదిలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత అంజనానపురానికి చెందిన ఆదిలక్ష్మిది, ఆర్థికంగా నిరుపేద కుటుంబం. భర్త మెకానిక్గా పనిచేసుకుంటూ ఇద్దరు పిల్లలను పోషించేవారు. అయినా జీతం సరిపోయేది కాదు. ఆర్థిక ఇబ్బందులకు తాళలేక కుటుంబానికి ఆసరాగా నిలవాలనుకున్నది ఆదిలక్ష్మి. భర్తతో కలిసి ఏదైనా ఒక పని చేయాలని సంకల్పించుకుంది. అక్కడా ఇక్కడా అప్పు చేసి భార్యాభర్తలిద్దరూ సుజాతనగర్లో టైర్ వర్క్ షెడ్డు తెరిచారు. ఆదిలక్ష్మి మెకానిక్ వర్క్ నేర్చుకుంటూ తానే షెడ్డును నడిపిస్తున్నారు. వాహనాలకు గ్రీజు పెట్టడం నుంచి వెల్డింగ్ పనులు, పంచర్ వేయటం వరకు అన్ని పనులూ చేస్తూ ఆదిలక్ష్మి శభాష్ అనిపించుకుంటున్నారు.ఇప్పుడు తనే సొంతంగా కొత్త షాపు పెట్టుకోవాలని నిర్ణయించుకొని, సాయం కోసం ఎదురు చూస్తుండగా, ఎంఎల్సి కవిత ఆదిలక్ష్మికి అండగా నిలిచారు.