Wednesday, May 1, 2024

గిరిజనుల సమగ్ర వికాసానికి కృషి చేస్తున్న తెలంగాణ సర్కార్

- Advertisement -
- Advertisement -

హన్మకొండ టౌన్ : గిరిజనుల సమగ్ర వికాసానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని డిఆర్డీఏ పిడి శ్రీనివాస్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా భీమ దేవులపల్లి మండలం వీర్ల గడ్డ తండాలో శనివారం ఏర్పాటు చేసిన తెలంగాణ గిరిజన దినోత్సవ గ్రామసభలో డిఆర్ డీఏ పిడి శ్రీనివాస్ కుమార్ డిపిఓ జగదీష్, ఎంపీడీఓ భాస్కర్‌తో కలిసి పాల్గొన్నారు. గిరిజన దినోత్సవంలో భాగంగా గిరిజనుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలు, పథకాలను వివరిస్తూ, నూతనంగా ఏర్పాటు చేసిన లంబాడీ తండా గ్రామ పంచాయతీలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ప్రగతి నివేదిక చదివి వినిపించారు. ఈ సందర్భంగా డిఆర్డీఏ పిడి శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు 500 జనాభా ఉన్న గిరిజన ఆవాసాలను,తండాలను నూతన గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశామని, రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల వేడుకల లో భాగంగా నేడు ఆ గ్రామ పంచాయతీలలో గిరిజనోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నామని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం నూతన గ్రామపంచాయతీ భవనాల నిర్మాణం కొరకు నిధులను మంజూరు చేసిందని, లంబాడీ తండాలో గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ఆయన తెలిపారు. ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధి కోసం అనేక చర్యలు తీసుకుంటుందని, గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించేందుకు రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిందని అయన అన్నారు. గిరిజనుల సంసృతి, సాంప్రదాయాలను సంరక్షిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, సమ్మక్క సారలమ్మ జాతరను, సేవాలాల్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని అన్నారు. హైదరాబాద్‌లో గిరిజనుల కోసం సేవాలాల్ భవన్, ఆదివాసి భవన్, ఆత్మగౌరవ భవనాలను ప్రభుత్వం పూర్తి చేసిందని తెలిపారు.

ప్రభుత్వం 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నందున గ్రామస్తులంతా తప్పనిసరిగా అధికారికంగా విద్యుత్ కనెక్షన్ తీసుకోవాలని, ప్రభుత్వం అందించే సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అనంతరం డిపిఓ జగదీష్ మాట్లాడుతూ, గతంలో కనీస మౌళిక సదుపాయాలు ఉండేవి కాదని, పది సంవత్సరాల క్రితం రోడ్డు లేక లంబాడి తండా గ్రామస్తులు అనేక ఇబ్బందులకు గురయ్యారని అన్నారు. గిరిజనుల సమగ్ర వికాసానికి సీఎం కేసీఆర్ అనునిత్యం కృషి చేస్తున్నారని, మా తండాలో మా రాజ్యం అనే గిరిజనుల 60 సంవత్సరాల ఆకాంక్షను నెరవేరుస్తూ 500 జనాభా ఉన్న గిరిజన ఆవాసాలు గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశామని అన్నారు. మహిళలకు రుణాలు వడ్డీ లేకుండా అందిస్తున్నామని, గ్రామంలో ఉన్న భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించి రైతు బీమా, రైతు బంధు పథకాలను వర్తింపజేస్తామని అన్నారు.ఈ కార్యక్రమం లో సర్పంచ్ గాగులోత్ తుకరం ఎంపీటీసీ లలితా శ్రీనివాస్, భూక్యా కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News