ఖాళీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు
అన్ని అవరోధాలను అధిగమిస్తూనే నూతన ప్రణాళికలను రచిస్తున్న ప్రభుత్వం
ఉద్యోగుల కేడర్ స్ట్రెంత్, ఉద్యోగుల విభజనపై ప్రభుత్వం చర్యలు
మనతెలంగాణ/హైదరాబాద్: కొత్తగా అన్నీ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం అన్ని అవరోధాలను అధిగమిస్తూనే నూతన ప్రణాళికలను ప్రభుత్వం రచిస్తోంది. కొత్త పోస్టుల భర్తీకి అవరోధంగా ఉన్న జోన్ల సవరణను తాజాగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా 2018 ఆగష్టు 29వ తేదీన కొత్త జోనల్ విధానాన్ని రాష్ట్రపతి ఆమోదించి ‘ది తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ ఆర్గనైజేషన్ఆఫ్ లోకల్ కేడర్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆర్డర్ 2018’ పేరుతో కేంద్రం గెజిట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఆయా జోనల్లకు అనువుగా పోస్టులు, ఉద్యోగుల విభజన ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఆరంభించి అన్ని ప్రభుత్వ శాఖల నుంచి ఉద్యోగుల పోస్టుల వివరాలను సేకరించింది.
ప్రభుత్వానికి ఇచ్చిన ఖాళీ పోస్టుల వివరాలు
అయితే శాఖల వారీగా చూస్తే 33 ప్రభుత్వ శాఖల్లో భారీగా ఖాళీలు ఉన్నాయని అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. అయితే పదోన్నతులు, కొత్త జిల్లాల్లో ఆర్డర్ టూ సర్వ్, తాత్కాలిక కేటాయింపులు, 371 డి రద్దు, నూతన జోనల్ వ్యవస్థ ఏర్పాటుకు ఏర్పడిన ఆటంకాలతో నూతన నియామకాలపై కొంత జాప్యం నెలకొంది. ఈ నేపథ్యంలోనే కీలక శాఖల్లో ఉద్యోగాల భర్తీకి సిఎం కెసిఆర్ ఆమోదం వేయాలని నిర్ణయించారు. అధికారులు ప్రభుత్వానికి ఇచ్చిన ఖాళీ పోస్టుల్లో భాగంగా సెక్రటేరీయట్లో 600, గ్రూప్ 1లో 1,200, గ్రూప్ 2లో 3,000, గ్రూప్ 3లో, 8,000, క్లరికల్లో 35,000, కొత్త జిల్లాల పోస్టులు 40 వేలు, ఉపాధ్యాయ పోస్టులు 50 వేలు, డిగ్రీ కాలేజీ పోస్టులు 2,000, ఇంటర్ విద్యలో 4,500, యూనివర్శిటీల్లో 1,800 ఖాళీలు ఉన్నాయి.
వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్లో కలిపిన తరువాత మరోసారి తెలంగాణలో ఏర్పాటైన కొత్త జోన్లను మరోసారి సవరించే కసరత్తు ముమ్మరమయ్యింది. కొత్తగా రెండు జిల్లాల ఏర్పాటు వికారాబాద్ జిల్లా చేర్పుల నేపథ్యంలో ఈ సవరణ అనివార్యమయ్యింది. ములుగు, నారాయణపేట రెండు జిల్లాలు కొత్తగా ఉనికిలోకి రావడంతో ఈ రెండు జిల్లాలను కొత్త జోన్ వ్యవస్థలోకి కలుపుతూనే వికారాబాద్ జిల్లాను జోగులాంబ జోన్ నుంచి చార్మినార్ జోన్లోకి మార్చాల్సి ఉంది. జనగామ జిల్లాలోని గుండాల మండలాన్ని యాదాద్రి భువనగిరి జిల్లాలోకి మార్చాల్సి ఉండడంతో మరోసారి కొత్త జోన్ల సవరణ ఆవశ్యం అయ్యింది. వీటితో పాటు ఉద్యోగుల కేడర్ స్ట్రెంత్ నిర్ధారణ, ఉద్యోగుల విభజనపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రం ఏర్పడిన తరువాత కొత్తగా 7 జోన్లు రెండు మల్టీ జోన్లతో మార్పులు చేసింది. కొత్త విధానాల ప్రకారం స్థానిక కేడర్లలో నిబంధనల ప్రకారం కేడర్లను నిర్ధారించాల్సి ఉంటుంది. దీంతోపాటు కేడర్లలో పదోన్నతికి సమాన అవకాశాలు కల్పించేందుకు అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది.
రాష్ట్రంలో ప్రస్తుతం 19,363 మంది గెజిటెడ్ పోస్టులు జోనల్ వ్యవస్థకు కేంద్రం ఆమోదం, సవరణల తరువాత రాష్ట్రంలోని నిరుద్యోగులకు మేలు జరిగేలా సిఎం కెసిఆర్ ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. దాదాపు 14 శాఖల్లో నిలిచిపోయిన నియామకాలకు అడ్డు తొలగిపోనుంది. వివిధ శాఖల్లోని ఖాళీల భర్తీ నోటిఫికేషన్లతో నిరుద్యోగులకు వరంగా మారనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 19,363 మంది గెజిటెడ్, 2,35,400 మంది నాన్ గెజిటెడ్, 35,598 మంది నాలుగో తరగతి ఉద్యోగులు, 75 వేల మంది ట్రెజరీ ద్వారా వేతనాలు పొందుతున్న ఇతర ఉద్యోగులున్నారు.