వరంగల్ అర్భన్ : తెలంగాణ ఐసెట్-2020 ఫలితాలు విడుదలయ్యాయి. వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీలో ఐసెట్ ఫలితాలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి సోమవారం విడుదల చేశారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన పరీక్షలో 90.28 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఆయన వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా 58,392 మంది విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా.. 45,975మంది పరీక్ష రాసినట్టు పాపిరెడ్డి చెప్పారు. వీరిలో 41,506 మంది విద్యార్థులు అర్హత సాధించారని వివరించారు. కరోనాతో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల్లోనూ బాగా చదివి అర్హత సాధించిన విద్యార్థులకు ఆయన శుభాకాంక్షలు చెప్పారు. విద్యార్థులు ఈ విద్యా సంవత్సరం నష్టపోకూడదని భావించి విపత్కర పరిస్థితుల్లోనూ పరీక్ష నిర్వహించి ఫలితాలు ఇచ్చామని తెలిపారు.
ఐసెట్లో మొదటి ర్యాంకును హైదరాబాద్లోని ఎస్సానగర్కు చెందిన బి శ్రీభశ్రీ 159.5 మార్కులతో మొదటి ర్యాంకును సాధించినట్లు ప్రకటించారు. రెండో ర్యాంకు సందీప్ 144.50 (ఆర్మూర్, నిజామాబాద్), మూడో ర్యాంకు అవినాశ్ సిన్హా 142.43 (హైదరాబాద్), నాలుగో ర్యాంకు ప్రసన్న లక్ష్మి 142.45 (వరంగల్), ఐదో ర్యాంకు మదరవోని శ్రీకృష్ణ సాయి 141.40, (రంగారెడ్డి)ఆరో ర్యాంకు తిప్పర్తి అఖిల్రెడ్డి 140.933 (రంగారెడ్డి), ఏడో ర్యాంకు డి జయదీప్ 140.22 ( వెస్ట్ బెంగాల్), ఎనిమిదో ర్యాంకు పాటి అఖిల్రెడ్డి 139.11 ( నెల్లూరు ఆంధ్రప్రదేశ్), తొమ్మిదో ర్యాంకు వీఎస్ రాజేఖర్రెడ్డి 136.50 (గుంటూరు- ఏపీ), పదో ర్యాంకు మహ్మద్ సొహైల్ 135.86 (భద్రాద్ది కొత్తగూడెం) సాధించినట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ వివరించారు. కార్యక్రమంలో కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ పురుషోత్తం, ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ రాజిరెడ్డి పాల్గొన్నారు.