Saturday, April 27, 2024

అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం : అమిత్‌షా

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాలని నిర్ణయం తీసుకుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఆదివారం కర్ణాటకలోని బీదర్ జిల్లా బస్వకళ్యాణ్ తాలూకా గోరట గ్రామంలో జరిగిన బహిరంగసభలో తెలంగాణ విమోచన దినోత్సవం గురించి ప్రత్యేకంగా అమిత్ షా ప్రస్తావించారు. గోరట గ్రామంలో 1948 మే తొమ్మిదో తేదీన రజాకార్ల ఊచ కోత, వాళ్లతో పోరాడిన యోధుల గురించి ప్రస్తావిస్తూ, యావత్ దేశం స్వేచ్చా వాయువులు పీలుస్తుంటే హైదరాబాద్ రాష్ట్రం క్రూర నిజాం చేతిలో బందీగా ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భయపడుతోందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవం గతేడాది అద్భుతంగా నిర్వహించినట్లు అమిత్ షా చెప్పారు. ఈ ఏడాది కూడా తెలంగాణ విమోచనం దినోత్సవం నిర్వహిస్తామని ప్రకటించారు. అంతకుముందు గోరట గ్రామంలో ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయి పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌కుమార్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామితో పాటు వందలాది తెలంగాణ బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.

గోరటలో దేవాలయాన్ని సందర్శించిన బండి సంజయ్

గోరట గ్రామంలోని చారిత్రాత్మక లక్ష్మి అమ్మవారి దేవాలయాన్ని బండి సంజయ్ దర్శించుకున్నారు. నాడు రజాకార్ల ఊచకోత ఒక వైపు జరుగుతుంటే, మరోవైపు గ్రామస్థులకు ఆశ్రయం ఇచ్చి, వందలాది మందిని కాపాడిన చారిత్రాత్మక ఇంటిని బండి సంజయ్ సందర్శించారు. నాటి ఘటన, రజాకార్లతో గ్రామస్థులు వీరోచితంగా పోరాడిన గాథ గురించి బండి సంజయ్ స్థానికులను అడిగి తెలుసు కున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News