అవార్డులే కాదు.. నిధులు ఇవ్వండి: రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో అమలు చేసిన మిషన్ భగీరథ పథకంలో కేంద్రం పక్షపాత ధోరణి మరోమారు పార్లమెంటు సాక్షిగా బట్టబయలు అయిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరల శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మంగళవారం రాజ్యసభలో ఓ ప్రశకు సమాధానంగా కేంద్ర జలజీవన్ మిషన్ శాఖమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ, 2018 నుంచి 2021- వరకు రూ.2455.82 కోట్ల నిధులు కేటాయించామని లిఖితపూర్వకంగా తెలిపారు. ఈ నాలుగేళ్లలో తెలంగాణకు కేవలం రూ.311. 41 కోట్ల మాత్రమే విడుదల చేశామని కేంద్రమంత్రి తెలిపారు.
ఈ వాఖ్యలపై మంత్రి దయాకర్రావు స్పందిస్తూ ఈ నిధులను సైతం జాతీయ గ్రామీణాభివృద్ధి, నీటి పారుదల నిర్వహణపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమానికి వినియోగించామని పేర్కొన్నారు. మిషన్ భగీరథకు కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి అందించలేదన్నారు. రాష్ట్రంలోని మిషన్ భగీరథ ప్రేరణతో జల్ జీవన్ మిషన్ పథకాన్ని జాతీయ స్థాయిలో కేంద్రం ప్రవేశపెట్టిందన్నారు. ఈ దశలో అనేక రాష్ట్రాలు కూడా మిషన్ భగీరథ పథకాన్ని ఆయా రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. ఒక దశలో నీతి ఆయోగ్ 19వేల కోట్లు మిషన్ భగీరథకు ఇవ్వాలని సిఫారసు చేసినా కేంద్రం పట్టించుకోలేదని మంత్రి గుర్తుచేశారు. బిజెపి పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్ , గుజరాత్ రాష్ట్రాల్లో పనులు మొదలుపెట్టిన దశలోనే వందలాది కోట్ల రూపాయల నిధులను కేంద్రం అందజేసిందన్నారు..కేంద్రం సహాయం లేకుండా సిఎం కెసిఆర్ రూ.35వేల కోట్ల వ్యయం చేసి ఇంటింటికీ నల్లాల ద్వారా సురక్షితమైన మంచినీటిని రాష్ట్రవ్యాప్తంగా అందిస్తూ, అందరి మన్ననలను పొందారని మంత్రి అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల వివక్ష మానుకొని తగు నిధులు అందించాలని మంత్రి డిమాండ్ చేశారు.